సంప్రదాయ విద్యుత్ స్థానంలో సోలార్ వినియోగం పెరగాలి..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ విజయవంతం చేద్దాం..
మచిలీపట్నం: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి, ఆంధ్రప్రదేశ్ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సంప్రదాయ విద్యుత్పై ఆధారపడటం తగ్గించి, సోలార్ వంటి ప్రత్యామ్నాయ విద్యుత్ వనరుల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
మచిలీపట్నం 23వ డివిజన్లో ఏర్పాటు చేసిన పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ ప్లాంట్ మరియు గృహ యూనిట్ల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉల్లింగిపాలెం హరిజన కాలనీలో 2 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్ను పరిశీలించి, ప్రజలను అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మారుతున్న కాలానికి అనుగుణంగా ముందడుగు వేస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. గతంలో థర్మల్ విద్యుత్పై ఆధారపడ్డామని, తరువాత జల విద్యుత్, విండ్ పవర్ను వినియోగించుకున్నామని, ఇప్పుడు సోలార్ యుగం ప్రారంభమైందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
రూ.1.20 లక్షల వ్యయంతో 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండటంతో పాటు, బడుగు బలహీన వర్గాలకు సబ్సిడీలు కూడా అందుతున్నాయని వివరించారు. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రిడ్కు అనుసంధానం చేసి ఆదాయం పొందే అవకాశముందని చెప్పారు.
విద్యుత్ రంగంలో గతంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ, నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రాన్ని విద్యుత్ లోటు నుంచి మిగులు రాష్ట్రంగా మార్చినట్లు తెలిపారు. 2014లో 24 మిలియన్ యూనిట్ల లోటు ఉండగా, 2019 నాటికి మిగులు స్థాయికి తీసుకువచ్చామని చెప్పారు. అయితే గత ఐదేళ్లలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిందని విమర్శించారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సోలార్, విండ్ ఎనర్జీతో పాటు పంప్డ్ పవర్ ప్రాజెక్టులపై దృష్టి సారించిందని తెలిపారు. రివర్స్ పంపింగ్ విధానంతో విద్యుత్ ఉత్పత్తికి కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పెట్టుబడుల విషయంలో కూడా రాష్ట్రం ముందంజలో ఉందని మంత్రి పేర్కొన్నారు. అనకాపల్లిలో 6 గిగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్కు శంకుస్థాపన జరిగిందని, డేటా సెంటర్ల స్థాపనకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో గణనీయమైన భాగం ఏపీకి రావడానికి నారా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతే కారణమని అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని, సూపర్ సిక్స్ పథకాలు విజయవంతమయ్యాయని తెలిపారు. పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ వంటి పథకాలతో ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. రోడ్ల అభివృద్ధి, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి అంశాల్లో కూడా ప్రభుత్వం ముందంజలో ఉందని చెప్పారు.
మచిలీపట్నంలో ఇప్పటికే 975 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశామని, మొత్తం నియోజకవర్గంలో 10 వేల కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.