ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ కస్టమర్లకు కీలకమైన శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) సేవలను అధికారికంగా ప్రారంభించింది. ఈ సేవలు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులందరికీ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా మొబైల్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కాల్ డ్రాప్లు, స్పష్టత లేని వాయిస్ సమస్యలను పూర్తిగా అధిగమించేందుకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడనుంది. ఈ నిర్ణయంతో లక్షలాది బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మెరుగైన కాలింగ్ అనుభవం అందనుంది.
బేస్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల లోపలి భాగాలు, కాంక్రీట్ నిర్మాణాలు అధికంగా ఉన్న ప్రాంతాలు, అలాగే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ సమస్య సాధారణంగా ఎదురవుతుంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో కూడా స్పష్టమైన వాయిస్ కాల్స్ అందించడమే వాయిస్ ఓవర్ వైఫై సేవల ప్రధాన ఉద్దేశ్యం. వినియోగదారులు తమకు అందుబాటులో ఉన్న బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ లేదా ఇతర ఏదేని వైఫై నెట్వర్క్కు కనెక్ట్ అయి, ఫోన్లోని సాధారణ డయలర్ నుంచే నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఎలాంటి కొత్త యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకపోవడం ఈ సేవ ప్రత్యేకతగా నిలుస్తోంది.
దేశవ్యాప్తంగా టెలికాం నెట్వర్క్ను ఆధునికీకరించే కార్యక్రమంలో భాగంగానే వాయిస్ ఓవర్ వైఫై సేవలను ప్రారంభించినట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా సరైన మొబైల్ సేవలు అందని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఇది కీలకమైన అడుగుగా పేర్కొంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ సేవలు ఉపయోగపడతాయని, వినియోగదారులకు నాణ్యమైన కమ్యూనికేషన్ సేవలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేసింది.
ఈ సేవలను వినియోగించుకోవాలంటే వాయిస్ ఓవర్ వైఫైకి సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ ఉండాలి. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్లి ‘వైఫై కాలింగ్’ లేదా ‘VoWiFi’ ఆప్షన్ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ఆప్షన్ ఆన్ చేస్తే, వైఫై నెట్వర్క్ అందుబాటులో ఉన్న చోట్ల ఆటోమేటిక్గా కాల్స్ వైఫై ద్వారా కనెక్ట్ అవుతాయి. ఈ సేవల ప్రారంభంతో బీఎస్ఎన్ఎల్ కూడా జియో, ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీల సరసన చేరినట్లయింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ పోటీ టెల్కోలతో సమానంగా ఆధునిక సేవలు అందించడంపై ఇది ఒక కీలక మైలురాయిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.