సంక్రాంతి పండుగ వేళ కోనసీమలోని ఓ కుటుంబం తమ కొత్త అల్లుడికి ఇచ్చిన ఆతిథ్యం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయం, ఆప్యాయత, అతిథి సత్కారానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచేలా ఏకంగా 1,574 రకాల వంటకాలతో భారీ విందు ఏర్పాటు చేసి గోదావరి జిల్లాల మర్యాదను మరోసారి దేశానికి చాటిచెప్పింది. ఈ అరుదైన ఘటన కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామంలో చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ విందు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆదుర్రు గ్రామానికి చెందిన విజ్జెపు వెంకటరత్నం, సుశీల దంపతులు తమ కుమార్తె కీర్తిశ్రీని గత ఏడాది ఫిబ్రవరిలో పి. గన్నవరం మండలం ముంగండకు చెందిన సాయి శరత్కు వివాహం చేసి ఇచ్చారు. ఈ ఏడాది సంక్రాంతి ఈ దంపతులకు తొలి పండుగ కావడంతో, సంప్రదాయం ప్రకారం అల్లుడు గురువారం అత్తవారింటికి వచ్చాడు. ఈ తొలి పండుగను జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలని భావించిన అత్తమామలు, అల్లుడికి అపూర్వమైన ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా గ్రామస్థుల సహకారంతో భారీ ఏర్పాట్లు చేశారు.
ఈ విందులో సంప్రదాయ పిండివంటలు, తీపి పదార్థాలు, కూరలు, పచ్చళ్లు, పండ్లు, శీతల పానీయాలు ఇలా మొత్తం 1,574 రకాల వంటకాలను వడ్డించారు. ఒక్కో వంటకం ప్రత్యేక శ్రద్ధతో, సంప్రదాయ రుచిని కాపాడుతూ తయారు చేయడం విశేషం. అంతేకాకుండా, ఏడాదిలోని 12 నెలలకు ప్రతీకగా అల్లుడికి 12 ప్రత్యేక బహుమతులు అందించి తమ ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు. ఈ అపూర్వ ఆతిథ్యాన్ని చూసి అల్లుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొందరు దీన్ని “కోనసీమ మర్యాదకు సజీవ ఉదాహరణ”గా అభివర్ణించారు.
ఇలాంటి విందులు ఇటీవల కాలంలో గోదావరి జిల్లాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. ఇటీవలే ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఓ కొత్త అల్లుడికి 1,116 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేయగా, ఇప్పుడు ఆదుర్రు గ్రామంలో జరిగిన ఈ విందుతో ఆ రికార్డు బద్దలైంది. అంతకుముందు విశాఖలో ఓ కొత్త అల్లుడికి 290 రకాల వంటకాలతో విందు ఇవ్వడం, తెనాలిలో 158 రకాల వంటకాలతో అతిథ్యమిచ్చిన ఘటనలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అయితే, 1,574 వంటకాలతో ఏర్పాటు చేసిన ఈ సంక్రాంతి విందు మాత్రం కోనసీమ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది.