- Travel: తిరుపతి భక్తులకు శుభవార్త: నర్సాపురం - తిరుపతి మధ్య కొత్త వీక్లీ రైలుకు గ్రీన్ సిగ్నల్..
- "ప్రయాణీకుల సౌకర్యమే పరమావధి": ప్రత్యేక రైళ్లను క్రమబద్ధీకరిస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు..
New Trains: తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ భారీ ఊరటనిస్తూ రెండు కొత్త వారపు ఎక్స్ప్రెస్ రైళ్లను మంజూరు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్లను క్రమబద్ధీకరించడమే కాకుండా, మరికొన్ని సర్వీసులను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా చర్లపల్లి-నర్సాపురం-చర్లపల్లి మధ్య నడిచే వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు (17061/17062) మే 2వ తేదీ నుంచి రెగ్యులర్ సర్వీసుగా అందుబాటులోకి రానుంది. ఈ రైలు ప్రతి శనివారం రాత్రి చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం నర్సాపురం చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో ఆదివారం రాత్రి నర్సాపురంలో బయలుదేరి సోమవారం ఉదయం చర్లపల్లికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ సర్వీసు నల్గొండ, గుంటూరు, విజయవాడ మీదుగా భీమవరం, పాలకొల్లు వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించనుంది.
మరో ప్రధాన నిర్ణయంలో భాగంగా నర్సాపురం-తిరుపతి-నర్సాపురం (17428/17427) మధ్య కూడా కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 27 నుంచి ప్రారంభం కానున్న ఈ సర్వీసు ప్రతి సోమవారం నర్సాపురంలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మే 3 నుంచి ప్రతి ఆదివారం రాత్రి తిరుపతిలో బయలుదేరి సోమవారం ఉదయం నర్సాపురం చేరుకునేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ రైలు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతికి వెళ్లే భక్తులకు, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని రైల్వే వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
కొత్త రైళ్లతో పాటు ప్రస్తుతం నడుస్తున్న మరికొన్ని సర్వీసుల్లో కూడా రైల్వే బోర్డు సానుకూల మార్పులు చేసింది. ఇండోర్-లింగంపల్లి హంసఫర్ ఎక్స్ప్రెస్ను ఏప్రిల్ 25 నుంచి చర్లపల్లి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రయాణికుల నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్ దృష్ట్యా కాకినాడ టౌన్-లింగంపల్లి ఎక్స్ప్రెస్ను వారానికి మూడు రోజుల నుంచి రోజువారీ సర్వీసుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 21 నుంచి ఈ రైలు ప్రతిరోజూ అందుబాటులో ఉండటమే కాకుండా, సామర్లకోటలో అదనపు హాల్ట్ను కూడా కేటాయించారు. ఈ విస్తరణ మరియు క్రమబద్ధీకరణ చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత పటిష్టం కానుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ చేపట్టిన ఈ మార్పులు రవాణా వ్యవస్థలో సానుకూల ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.