సీఎం చంద్రబాబు చొరవతోనే విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలు..
సీఎం సూచనల మేరకు విద్యుత్ కొనుగోళ్లు గణనీయంగా తగ్గించాం..
తిరుపతి: రాష్ట్రంలో విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాల ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతోనే ఈ నియామకాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 18 మంది లబ్ధిదారులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి పైగా ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని మంత్రి వెల్లడించారు. కుటుంబాలను ఆదుకోవడం లక్ష్యంగా ఈ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు.
కారుణ్య నియామకాలలో వయోపరిమితి సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి వయస్సు పరిమితిలో సడలింపులు ఇచ్చారని మంత్రి చెప్పారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా 500కుపైగా నియామకాలు జరిగాయని, అందులో సుమారు 30 మందికి ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. త్వరలోనే ఏఈ స్థాయిలో కూడా కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
విద్యుత్ శాఖ ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడుతూ ప్రజలకు సేవ చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. తుఫానుల సమయంలో 1500 మంది సిబ్బంది గోదావరి, విశాఖ జిల్లాల్లో ప్రాణాలకు తెగించి సేవలందించారని గుర్తు చేశారు. 12 వేల విద్యుత్ స్తంభాలను మార్చి, 24 గంటల్లో సరఫరా పునరుద్ధరించడం గొప్ప విజయమన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నందున విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఉత్పత్తి పెంచుతున్నామని తెలిపారు. సీఎం సూచనలతో విద్యుత్ కొనుగోళ్లు గణనీయంగా తగ్గించామని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచిందని విమర్శించిన మంత్రి… ఆ పార్టీకి ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని ఆకనంబట్టు ప్రాంతంలో ఎస్సీ కాలనీలో ఉచిత సోలార్ రూఫ్టాప్ యూనిట్లను మంత్రి ప్రారంభించారు. 200 యూనిట్ల లోపు వినియోగించే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సుమారు రూ.1.25 లక్షల విలువైన 2 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ యూనిట్లు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
పూతలపట్టులో 4,200 ఇళ్లకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తుండగా, ఇందుకు రూ.52 కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఉచిత సోలార్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందిస్తామని తెలిపారు.
పూతలపట్టులో రూ.175 కోట్ల ఆర్డీఎస్ఎస్ పనులు జరుగుతున్నాయని, అందులో రూ.77 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల నిర్మాణం, కొత్త లైన్ల ఏర్పాటు ద్వారా లో వోల్టేజ్ సమస్యలు తగ్గిస్తామని చెప్పారు. 65 సబ్ స్టేషన్లకు అనుమతులు తీసుకున్నామని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేస్తున్నా… ఏపీలో మాత్రం ట్రూ డౌన్ అమలు చేసి ప్రజలపై భారం తగ్గించామని మంత్రి పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు పెంచవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.
ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ‘డయల్ యువర్ సిఎండి’, ‘కరెంటోళ్ల జనబాట’ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఫీడర్ సోలరైజేషన్ ద్వారా రైతులకు పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, మురళీమోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, అలాగే ఎస్పీడీసీఎల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.