విమాన ప్రయాణ భద్రతపై డీజీసీఏ ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన అనంతరం ఎయిరిండియాకు నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
క్యాబిన్ సిబ్బంది విశ్రాంతి, శిక్షణ నిబంధనలు, నిర్వహణలో లోపాల వంటి అంశాల్లో ఉల్లంఘనలు జరిగినట్లు ఎయిరిండియా కూడా అంగీకరించినట్టు సమాచారం. గత ఆరు నెలల్లో భద్రతా సంబంధిత అంశాల్లో మొత్తం తొమ్మిది నోటీసులు డీజీసీఏ జారీ చేసినట్లు పౌర విమానయాన శాఖ రాజ్యసభలో వెల్లడించింది. ఎయిరిండియా ఉల్లంఘనలపై తగిన చర్యలు తీసుకున్నామని తెలిపింది.