దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) తన వినియోగదారులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)తో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐఓసీఎల్ ఫ్యూయల్ రిటైల్ అవుట్లలోనే మారుతి సుజుకీ కార్లకు సంబంధించిన సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. పెట్రోల్ బంకుల వద్దే కార్ సర్వీసింగ్ సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల వినియోగదారుల సమయం, ఖర్చు రెండూ ఆదా కానున్నాయి.
ఈ కొత్త సర్వీస్ సెంటర్లలో మారుతి కార్లకు సంబంధించిన సాధారణ నిర్వహణ, రొటీన్ మెయింటెనెన్స్, చిన్నచిన్న మరమ్మతులతో పాటు అవసరమైతే ఇతర కీలక సర్వీసులు కూడా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెట్రోల్ నింపించుకునేందుకు వచ్చే సమయంలోనే కార్ చెక్అప్, సర్వీస్ చేయించుకునే అవకాశం ఉండటంతో వినియోగదారులకు ఇది మరింత సౌకర్యంగా మారనుంది. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్, అపాయింట్మెంట్ సమస్యలు లేకుండా త్వరితగతిన సేవలు పొందే వెసులుబాటు కలుగుతుందని మారుతి అధికారులు చెబుతున్నారు.
మహారత్న హోదా కలిగిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు దేశవ్యాప్తంగా సుమారు 41 వేల ఫ్యూయల్ స్టేషన్ల భారీ నెట్వర్క్ ఉంది. ఈ విస్తృత నెట్వర్క్ను ఉపయోగించుకోవడం ద్వారా మారుతి సుజుకీ తన సర్వీస్ సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయనుంది. ఇప్పటికే దేశంలోని 2,882 నగరాలు, పట్టణాల్లో 5,780 సర్వీస్ టచ్పాయింట్లను కలిగి ఉన్న మారుతి సర్వీస్ నెట్వర్క్ ఈ భాగస్వామ్యంతో మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన కార్ సర్వీసింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఒప్పందంపై స్పందించిన మారుతి సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సర్వీస్) రామ్ సురేష్ ఆకెళ్ల మాట్లాడుతూ, “కస్టమర్లకు కార్ సర్వీసింగ్ను వీలైనంత సులభంగా, వేగంగా, నమ్మకంగా అందించడమే మా లక్ష్యం. ఇందుకోసం ఇండియన్ ఆయిల్కు ఉన్న విస్తృత నెట్వర్క్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం” అని తెలిపారు. అలాగే, ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ (మార్కెటింగ్) సౌమిత్రా పి. శ్రీవాస్తవ మాట్లాడుతూ, “ఇంధన సేవలతో పాటు ప్రపంచ స్థాయి ఆటోమోటివ్ నిర్వహణ సేవలను అందించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ భాగస్వామ్యం వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది” అని పేర్కొన్నారు.