సంక్రాంతి పండుగను అవకాశంగా మలుచుకుని సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మాయ ఉచ్చులు వేస్తున్నారు. ‘‘ఫోన్పే లింక్ క్లిక్ చేస్తే రూ.5,000 మీ ఖాతాలో పడతాయి’’ అంటూ సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ మెసేజ్లలో ‘‘మొదట నమ్మలేదు.. కానీ నిజంగానే డబ్బులు వచ్చాయి’’ అనేలా నమ్మకం కలిగించే మాటలు ఉండటంతో చాలామంది అమాయకులు మోసపోయే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా లింకులు పూర్తిగా నకిలీవని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని క్లిక్ చేయవద్దని స్పష్టం చేస్తున్నారు.
పండుగ ఆఫర్ల పేరుతో వచ్చే ఈ లింక్లను ఓపెన్ చేసిన వెంటనే మొబైల్లో మాల్వేర్ ప్రవేశిస్తుందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఫోన్లో ఉన్న ఓటీపీలు, బ్యాంక్ లాగిన్ వివరాలు, యూపీఐ సమాచారం, వ్యక్తిగత డేటా అన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతాయి. ఫలితంగా క్షణాల్లోనే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పండుగ వేళ త్వరగా డబ్బులు వస్తాయనే ఆశతో లింక్లను క్లిక్ చేయడం ప్రమాదకరమని, పండుగ పేరుతో ఎవరూ ఉచితంగా డబ్బులు పంచరని పోలీసులు గుర్తు చేస్తున్నారు.
అలాగే ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్లు ఎప్పటికీ లింక్ల ద్వారా డబ్బుల ఆఫర్లు ఇవ్వవని స్పష్టంచేశారు. ఈ సంస్థల పేరుతో వచ్చే సందేశాలు, లింకులు అన్నీ మోసమేనని, అలాంటి మెసేజ్లు వస్తే వెంటనే డిలీట్ చేయాలని సూచించారు. స్నేహితులు లేదా సన్నిహితులు ఫార్వార్డ్ చేసిన మెసేజ్ అయినా సరే నిజమని నమ్మవద్దని, ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా లింక్లను క్లిక్ చేసి డబ్బులు కోల్పోయిన కేసులు అనేకం నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.
ఒకవేళ పొరపాటున సైబర్ నేరగాళ్ల మాయలో చిక్కుకుని డబ్బులు పోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైం హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే cybercrime.gov.in వెబ్సైట్లోనూ ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సమయానికి సమాచారం అందిస్తే పోయిన డబ్బులను కొంతవరకు అయినా తిరిగి పొందే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పండుగ ఆనందాన్ని సైబర్ మోసగాళ్లు దోచుకోకుండా ఉండాలంటే అప్రమత్తతే ఉత్తమ రక్షణ అని సైబర్ క్రైమ్ విభాగం మరోసారి హెచ్చరిస్తోంది.