జైలు శాఖ అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష సమావేశం..
వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన హోం మంత్రి..
అమరావతి సచివాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత జైలు శాఖ అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని జైళ్ల పరిస్థితి, ఖైదీల సంక్షేమం, భద్రతా చర్యలు, భవిష్యత్ సంస్కరణలపై సుదీర్ఘంగా చర్చించారు. జైళ్లలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్నవి, పనిచేయని జైళ్లు కలిపి మొత్తం 106 జైళ్లు ఉన్నాయని సమావేశంలో వివరించారు. ఇందులో 25 జైళ్లు నాన్-ఫంక్షనింగ్గా ఉన్నాయని గుర్తించిన మంత్రి, వాటి పూర్తి వివరాలను ప్రత్యేకంగా జాబితా చేయాలని సూచించారు. ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర జైలు కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
రాజమండ్రి, విశాఖపట్నం జైళ్లలో ఖైదీల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో, కొన్ని మూసివేసిన జైళ్లను పునరుద్ధరించి ఖైదీలను అక్కడికి తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు. జైళ్లలో రద్దీ తగ్గించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రతి జిల్లాలో ఒక జిల్లా జైలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. భీమునిపట్నం జైలు కూల్చివేత అంశంపై పూర్తి నివేదిక సమర్పించాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
చింతపల్లి జైలు ప్రస్తుతం వినియోగంలో లేకపోవడంతో, ITDA నిధులతో దాన్ని పునరుద్ధరించే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. జైళ్లతో పాటు రిహాబిలిటేషన్ మరియు డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటుపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో భూముల కేటాయింపు అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
జైళ్ల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా “ప్రిజన్ డెవలప్మెంట్ ఫండ్” ఏర్పాటు చేసే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో NDPS కేసుల విచారణ కోసం ప్రత్యేక MAPS కోర్టుల ఏర్పాటు అంశంపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు.
ఖైదీల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి అనిత సూచించారు. జైళ్లలో సైకియాటిక్ సపోర్ట్ అందించే విధానంపై కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. అలాగే ఖైదీలకు స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించి వారిలో మార్పు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
పెరోల్పై విడుదలైన ఖైదీల పూర్తి వివరాలు సేకరించి, వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. జైళ్లలో మొబైల్ ఫోన్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు NLJD పరికరాల వినియోగంపై పరిశీలించాలని సూచించారు. ఖైదీలు, సిబ్బంది ద్వారా మొబైల్ వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జైళ్లలో ఆత్మహత్యలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, జైళ్ల నుంచి వీడియోలు బయటకు వెళ్లకుండా పటిష్ట భద్రతా వ్యవస్థ అమలు చేయాలని మంత్రి అన్నారు. స్వల్పకాల, దీర్ఘకాల జైలు సంస్కరణల కోసం SOP ఆధారిత కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
జైళ్ల శాఖకు అవసరమైన కొత్త వాహనాలపై కూడా నివేదిక సిద్ధం చేయాలని మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఖైదీల భద్రత, పునరావాసం, జైళ్ల ఆధునీకరణ లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది.