ఐదేళ్ల పాలనలో అమరావతి రైతులపై చేయని అరాచకం లేదు..
ఇప్పుడు రైతులకు అన్యాయమంటూ సరికొత్త డ్రామాకు తెరలేపారు..
మచిలీపట్నంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుంటే, దాన్ని చూసి ఓర్వలేక జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, అమరావతి విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలను ఖండించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.
అమరావతి రైతులపై గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు సృష్టించారని, ఇప్పుడు అదే రైతుల పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపడం రాజకీయ స్వార్థమేనన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య విభేదాలు పెంచారని, భూములు ఇచ్చిన రైతులపై కేసులు పెట్టి, నిరసనలు అణిచివేసేందుకు బలప్రయోగం చేశారని విమర్శించారు.
అమరావతి నిర్మాణం ఇప్పుడు వేగంగా జరుగుతుండటాన్ని చూసి వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రైతులకు ప్లాట్ల కేటాయింపులు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని, అధికారుల కమిటీలు, కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకే భూ కేటాయింపులు జరుగుతున్నాయని వివరించారు. అమరావతి పేరుతో ప్రజల్లో అపోహలు సృష్టించడం సిగ్గుచేటని అన్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, ప్రజాధన దుర్వినియోగంపై కూడా మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, రుషికొండలో విలాసవంతమైన నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల పేదల ఇళ్లను కూల్చివేశారని కూడా విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన దిశలో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాయలసీమలో కియా తర్వాత డ్రోన్స్, డిఫెన్స్ రంగ సంస్థలు తీసుకొచ్చామని, తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ కూడా రాష్ట్రానికి వచ్చిందన్నారు. ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయం, గూగుల్ డేటా సెంటర్, అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి భారీ ప్రాజెక్టులు తీసుకొచ్చామని చెప్పారు.
కృష్ణా, గుంటూరు జిల్లాలను సీఆర్డీఏ పరిధిలో చేర్చేందుకు ప్రతిపాదనలు పంపామని, మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ కోసం డీపీఆర్ సిద్ధమవుతోందన్నారు. విజయవాడ-మచిలీపట్నం రహదారిని ఆరు లైన్లుగా విస్తరించనున్నట్లు తెలిపారు. అమరావతి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఇన్ల్యాండ్ వాటర్వేస్ అభివృద్ధి కూడా చేపడుతున్నామని వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కూడా మంత్రి తప్పుబట్టారు. దేశాన్ని ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా నిలబెట్టేందుకు మోదీ కృషి చేస్తున్నారని, అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడం ప్రజలు సహించరని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.