రాష్ట్రంలో వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష..
3.2 లక్షల వీధి కుక్కల నియంత్రణకు స్పెషల్ డ్రైవ్..
అమరావతి: రాష్ట్రంలో వీధి కుక్కల సమస్యపై ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ కూడా పాల్గొన్నారు.
వీధి కుక్కల స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇటీవల విశాఖపట్నంలో ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత బాలుడికి అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని విశాఖ మున్సిపల్ కమిషనర్కు స్పష్టమైన సూచనలు చేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పట్టణాలకు దూరంగా వీధి కుక్కల కోసం ప్రత్యేక ఫుడ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. ప్రజల భద్రతతో పాటు జంతు సంరక్షణ కూడా సమానంగా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 3.2 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అధికారులు సమావేశంలో వెల్లడించారు. అందులో ఇప్పటికే 1.8 లక్షల కుక్కలకు స్టెరిలైజేషన్ శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన కుక్కలకు కూడా త్వరగా శస్త్రచికిత్సలు పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని మంత్రి నారాయణ ఆదేశించారు.
పట్టణాల్లో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, పిల్లలు సురక్షితంగా ఉండేలా మున్సిపల్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.