24 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక వర్గం ఏర్పాటు..
సాయంత్రం సీఎం విజయ్ను కలిసి మద్దతు తెలపనున్న అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు..
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా సీనియర్ నేతలు షణ్ముగం, వేలుమణి స్వరం పెంచడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. సుమారు 24 మంది ఎమ్మెల్యేలు ఈ రెబల్ గ్రూప్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ వర్గం ఇవాళ సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను కలిసి తమ మద్దతు ప్రకటించనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రేపు తమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణ జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వం బలం నిరూపించుకోవాల్సిన కీలక సమయంలో అన్నాడీఎంకేలో చీలిక రావడం రాజకీయ సమీకరణాలను వేడెక్కిస్తోంది.
ఇక పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ పదవులకు పళనిస్వామి రాజీనామా చేయాలని రెబల్ వర్గం డిమాండ్ చేస్తోంది. పార్టీ నాయకత్వంలో మార్పులు అవసరమని వారు భావిస్తున్నట్లు సమాచారం.
ఇవాళ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల అనంతరం మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి సీఎం విజయ్కు మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా తెలియజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ పరిణామాలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారాయి. రేపటి బలనిరూపణపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.