Juvvaladinne Fishing Harbor: జువ్వలదిన్నె హార్బర్ అడ్డంకులకు జగన్ రెడ్డే కారణం.. సోమిరెడ్డి ఫైర్..!
Juvvaladinne Fishing Harbor: జువ్వలదిన్నె హార్బర్, రామాయపట్నం పోర్టుల నిర్మాణానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన జీఓలే అడ్డంకిగా మారాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే నిధులు సాధించామని, మూడు నెలల్లో హార్బర్ పనులు పూర్తి చేసి మత్స్య…
Juvvaladinne Fishing Harbor: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశం ఇప్పుడు వేడి పుట్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మత్స్యకారుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదని ఆయన విమర్శించారు.
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కుమారుడి ఆర్థిక ప్రయోజనాల కోసం తీర ప్రాంతాభివృద్ధిని అడ్డుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. 2008లో జారీ చేసిన జీఓ నంబర్ 40 ద్వారా కృష్ణపట్నం పోర్టు నుంచి వాడరేవు వరకు ఎటువంటి కొత్త పోర్టులు లేదా హార్బర్లు నిర్మించకూడదని ఆంక్షలు విధించారని గుర్తు చేశారు. దీనివల్ల రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బర్ పనులు దశాబ్ద కాలం నిలిచిపోయాయని ఆయన ఆధారాలతో సహా వివరించారు.
2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆ అడ్డగోలు జీఓలను రద్దు చేశారని సోమిరెడ్డి తెలిపారు. అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహకారంతో ఢిల్లీ స్థాయిలో పోరాడి జువ్వలదిన్నె హార్బర్ కోసం రూ. 288 కోట్లు (కేంద్రం రూ. 138 కోట్లు, రాష్ట్రం రూ. 150 కోట్లు) మంజూరు చేయించామని చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన 908 మీటర్ల జెట్టీతో ఈ మెగా హార్బర్ను తామే డిజైన్ చేయించామని ఆయన స్పష్టం చేశారు.
గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం కాంట్రాక్టుల ద్వారా డబ్బులు దండుకోవడం తప్ప, హార్బర్ పనులను పూర్తి చేయలేదని సోమిరెడ్డి విమర్శించారు. మత్స్యకారుల కోసం తాము కష్టపడి నిధులు తెస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని జగన్ జువ్వలదిన్నె పర్యటనకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
జువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేటుపరం చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని సోమిరెడ్డి కొట్టిపారేశారు. సాగర్ డిఫెన్స్ వంటి సంస్థలు రావడం వల్ల మత్స్యకార యువతకు అత్యాధునిక టెక్నాలజీపై అవగాహన పెరుగుతుందని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. మత్స్యకారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు.
మత్స్యకారుల చిరకాల స్వప్నమైన జువ్వలదిన్నె హార్బర్ను మరో మూడు నెలల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వదిలేసిన పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ రెడ్డి తన పర్యటనలో గతంలో జారీ చేసిన ఆ వ్యతిరేక జీఓలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Be the first to react