PM Ujjwala Yojana: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. పేద మహిళల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రారంభమైన ఈ పథకం కింద గ్యాస్ వాడుతున్న వారు, తమకు వచ్చే సబ్సిడీని కోల్పోకుండా ఉండాలంటే వెంటనే అప్రమత్తం కావాలి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్పై లభించే రూ.300 రాయితీని పొందడానికి ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
ఏటా ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరి
ఉజ్వల పథకం కింద లబ్ధిదారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి తమ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారికి మాత్రమే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సొమ్ము నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఒకవేళ కేవైసీ పూర్తి చేయకపోతే, గ్యాస్ రీఫిల్ బుకింగ్లో గానీ లేదా సబ్సిడీ అందడంలో గానీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సబ్సిడీ ఎవరికి.. ఎంత వరకు?
ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ తీసుకునే ఉజ్వల వినియోగదారులకు ప్రభుత్వం ఒక్కో సిలిండర్పై రూ.300 సబ్సిడీ ఇస్తోంది. అయితే, ఇది ఏడాదికి గరిష్టంగా 9 రీఫిల్స్కు మాత్రమే వర్తిస్తుంది. 14.2 కిలోల సిలిండర్ వాడేవారు 8వ లేదా 9వ రీఫిల్ సమయానికి కచ్చితంగా బయోమెట్రిక్ పూర్తి చేయాలి. అదేవిధంగా 5 కిలోల చిన్న సిలిండర్లు వాడే వారైతే, 21వ రీఫిల్ నుంచి ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
డెడ్లైన్ ఎప్పటి వరకు అంటే..
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవైసీ ప్రక్రియను మార్చి 31, 2026 లోపు పూర్తి చేయాలని గ్యాస్ కంపెనీలు సూచిస్తున్నాయి. దేశంలో గ్యాస్ కొరత ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, అర్హులైన వారికే సబ్సిడీ చేరాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన తర్వాత కేవైసీ పెండింగ్లో ఉంటే సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను ముగించుకోవడం ఉత్తమం.
ఇంట్లోనే కేవైసీ పూర్తి చేసే అవకాశం
వినియోగదారుల సౌకర్యార్థం ఈ కేవైసీ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. దీని కోసం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. హెచ్పీ పే మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నుంచే బయోమెట్రిక్ పూర్తి చేయవచ్చు. ఒకవేళ యాప్ వాడటం తెలియకపోతే, ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తి ద్వారా కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేసే వెసులుబాటును కల్పించారు.