జూన్ 2, 2024 నుంచే అమలు: జగన్ పాలన చివరి 11 రోజులూ అమరావతే రాజధాని…
లోక్సభ ముందుకు రాజధాని సవరణ బిల్లు – అస్పష్టతకు కేంద్రం శాశ్వత పరిష్కారం…
‘అమరావతి’ అంటే ఏంటో స్పష్టం చేసిన కేంద్రం: ఏపీసీఆర్డీఏ పరిధి మొత్తానికే హోదా…
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అత్యున్నత చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోనుంది. విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించడం ద్వారా "అమరావతి"ని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. గత కొంతకాలంగా రాజధాని విషయంలో కొనసాగుతున్న న్యాయపరమైన చిక్కులు, రాజకీయ సందిగ్ధతలకు ఈ సవరణతో శాశ్వతంగా తెరపడనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2026 ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) పరిధిలోని ప్రాంతమంతా అమరావతిగా గుర్తించబడటం గమనార్హం.
ఈ చట్ట సవరణలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, దీనిని జూన్ 2, 2024 నుండి పాత తేదీతో (Retrospective effect) అమలులోకి తీసుకురావడం. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి 11 రోజుల సమయాన్ని కూడా కలుపుకుంటూ ఈ చట్టం అమలు కానుంది. ఇది రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. గతంలో 'మూడు రాజధానుల' పేరుతో జరిగిన ప్రయోగాలకు, అమరావతిని నిర్వీర్యం చేయాలని చూసిన ప్రయత్నాలకు ఈ కేంద్ర నిర్ణయం ఒక గట్టి సమాధానంగా నిలిచింది. ధర్మమే గెలుస్తుందన్న నానుడిని నిజం చేస్తూ, వేలాది మంది రైతుల సుదీర్ఘ పోరాటానికి పార్లమెంటు సాక్షిగా గుర్తింపు లభించింది.
రాజకీయ పరిణామాలను గమనిస్తే, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని తీర్మానం ప్రవేశపెట్టిన తీరు, ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రస్తుత పరిస్థితులు ఒక ‘దేవుడి స్క్రిప్ట్’ లాగే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం 11 స్థానాలకే పరిమితమైన గత పాలకులు సభకు రావడానికి కూడా జంకుతున్న తరుణంలో, అమరావతికి పట్టాభిషేకం జరగడం విశేషం. విభజన చట్టంలో ఉన్న అస్పష్టతను తొలగించి "కొత్త రాజధాని ఉండాలి" అన్న పాత వాక్యం స్థానంలో "అమరావతి కొత్త రాజధానిగా ఉండాలి" అని స్పష్టంగా చేరుస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వాలు వచ్చినా రాజధాని మార్పుపై నిర్ణయాలు తీసుకోవడం దాదాపు అసాధ్యం కానుంది.
కేంద్రం తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయంతో అమరావతి జైత్రయాత్రకు ఇక అడ్డంకులు తొలగిపోయాయి. లోక్సభ మరియు రాజ్యసభల్లో ఈ బిల్లు త్వరితగతిన ఆమోదం పొందేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు మార్గం సుగమమైంది. అస్పష్టత వీడి ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారబోతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని విషయంలో రాజకీయ అనిశ్చితికి శుభం కార్డు పడటంతో ఇక పెట్టుబడులు, అభివృద్ధి పరుగులు పెడతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.