ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, రహదారులు, రైల్వే మార్గాలు, ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు వంటి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పనులు వేగం పుంజుకున్నాయి. తాజాగా మంగళగిరిలో మరో కీలక ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడ వైపు ప్రయాణించే వాహనదారులకు పెద్ద సౌకర్యం కలగనుంది.
మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరావతికి ముఖద్వారం అయిన మంగళగిరి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రహదారి విస్తరణలు, ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గౌతమ బుద్ధ రోడ్డుపై రూ.200 కోట్ల వ్యయంతో 1.25 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆహ్వానించగా, మేఘా ఇంజనీరింగ్ సంస్థకు కాంట్రాక్ట్ లభించింది.
ఫ్లైఓవర్ నిర్మాణం టీ-ఆకారంలో ఉండనుంది. పాత బస్టాండ్ సర్కిల్ నుంచి గుంటూరు వైపు 600 మీటర్లు, రోడ్డు భవనాల శాఖ బంగ్లా వరకు 650 మీటర్లు కలిపి మొత్తం 1.25 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తయితే, మంగళగిరి నుంచి విజయవాడ దిశగా వెళ్లే వాహనదారులకు భారీ సౌకర్యం లభించనుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో అమరావతి టౌన్షిప్ వద్ద నుంచి నిడమర్రు రైల్వే గేటు దాకా ఆర్వోబీ నిర్మాణాన్ని కూడా రైల్వే శాఖ చేపట్టింది. ఇందుకోసం రూ.129.18 కోట్ల నిధులు కేటాయించగా, అనుమతులు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ఆర్వోబీకి అనుసంధానంగా నాలుగు లైన్ల సర్వీస్ రోడ్లను రూ.77 కోట్లతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించనుంది.
ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అభివృద్ధి చర్యలు మంగళగిరిని రవాణా, వ్యాపారం, నివాస పరంగా మరింత ప్రగతిశీల నగరంగా మలుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద, ఈ ఫ్లైఓవర్ మరియు ఆర్వోబీ ప్రాజెక్టులు అమరావతి పరిసర ప్రాంతాల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మైలురాయిగా నిలవనున్నాయి.