Nara Lokesh: రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా అది టీడీపీకే సాధ్యం! ప్రజాప్రతినిధులకు నారా లోకేశ్ హెచ్చరిక.!
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.
- Politics: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు: లోకేశ్ భావోద్వేగపూరిత ప్రసంగం…
- "జగన్కు క్రెడిట్ చోరీ డిజార్డర్ అనే వింత వ్యాధి వచ్చింది": మాజీ సీఎంపై లోకేశ్ సెటైర్లు…
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అని, రికార్డులు సృష్టించాలన్నా లేదా వాటిని తిరగరాయాలన్నా అది ఒక్క టీడీపీకే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. పసుపు జెండాను మోసే కార్యకర్తలే పార్టీకి నిజమైన అధినేతలని కొనియాడిన లోకేశ్, వారి సంక్షేమాన్ని కాపాడుకోవడమే తన ప్రథమ కర్తవ్యమని ప్రకటించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటివరకు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏకైక పార్టీ తమదేనని, కష్టపడి పనిచేసే వారికి గ్రామ స్థాయి నుండి పొలిట్బ్యూరో వరకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పాలనా సంస్కరణలు నేటికీ రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నాయని లోకేశ్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతను ప్రస్తావిస్తూ, ఆయనకు 75 ఏళ్ల వయస్సు వచ్చినప్పటికీ 25 ఏళ్ల యువకుడి వేగంతో (స్పీడ్ 25) పని చేస్తున్నారని ప్రశంసించారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేయడంలో, ఒక దళితుడిని లోక్సభ స్పీకర్గా నిలబెట్టడంలో చంద్రబాబు పోషించిన పాత్ర అద్వితీయమని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, క్లైమోర్ మైన్లకే భయపడని రక్తం తమదని, అక్రమ కేసులకు తాము లొంగే ప్రసక్తే లేదని ధ్వజమెత్తారు. టీడీపీ అడ్రస్ లేకుండా చేస్తామన్న వారే నేడు అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేస్తూ, ప్రజాప్రతినిధులు అహంకారం వీడి ప్రజలతో మమేకం కావాలని, లేదంటే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై లోకేశ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జగన్కు 'క్రెడిట్ చోరీ డిజార్డర్' అనే వింత వ్యాధి సోకిందని, ఇతరుల కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఆయన ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చమత్కరించారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో భారీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన అద్భుత తీర్పుతో ఏర్పడిన ఈ ప్రజా ప్రభుత్వం, సంక్షేమం మరియు అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని ముందుకు సాగుతుందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
Be the first to react