రాష్ట్రంలో సాగునీటి రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 38 వేల చెరువుల కింద సుమారు 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులో ఉందని వెల్లడించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, దీనివల్ల రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా చెరువుల నిర్వహణకు మరమ్మతులకు అవసరమైన నిధులను గత ప్రభుత్వం అసలు కేటాయించలేదని మంత్రి విమర్శించారు.
సాగునీటి ప్రాజెక్టుల కోసం అంతర్జాతీయ సంస్థలైన జైకా ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చిన నిధులను కూడా గత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందని రామానాయుడు ధ్వజమెత్తారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన 40 శాతం నిధులను విడుదల చేయకపోవడంతో అనేక ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని ఆయన వివరించారు.
అంతేకాకుండా, అప్పట్లో ఖర్చు చేసిన కొద్దిపాటి నిధులకు కూడా కనీసం 'యూటిలైజేషన్ సర్టిఫికెట్లు' సమర్పించకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయాయని మంత్రి గుర్తు చేశారు. ఈ నిర్లక్ష్యం వల్ల సాగునీటి రంగం కుదేలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి కాలువలు, చెరువుల పూడికతీత పనులను పూర్తిగా గాలికొదిలేయడంతో 'గ్యాప్ ఆయకట్టు' భారీగా పెరిగిపోయిందని మంత్రి పేర్కొన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందాల్సిన వ్యవస్థలు ఉన్నప్పటికీ, నిర్వహణ లోపం వల్ల ఆ భూములన్నీ బీడులుగా మారాయని ఆయన చెప్పారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందని, గ్యాప్ ఆయకట్టును తగ్గించి ప్రతి ఎకరాకు నీరు అందించడమే తమ లక్ష్యమని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు మేలు చేసే క్రమంలో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.
చెరువుల్లో పేరుకుపోయిన పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కొత్త జీవో జారీ చేసినట్లు చెప్పారు. కేవలం ఒక్క రూపాయికే ఒక క్యూబిక్ మీటర్ మట్టిని రైతులు తీసుకునేలా అనుమతులు ఇచ్చామని, దీనివల్ల ఒకవైపు చెరువుల్లో నీటి నిల్వ పెరుగుతుందని, మరోవైపు రైతులకు సారవంతమైన మట్టి దొరుకుతుందని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్రంలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టును మరింత విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. సాగునీటి వ్యవస్థలను ఆధునీకరించి, కాలువల చివరన ఉన్న భూములకు కూడా సమృద్ధిగా నీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాగునీటి రంగంలో పారదర్శకతను పెంచుతూ, గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది రైతులకు భరోసా కల్పిస్తామని నిమ్మల స్పష్టం చేశారు.