విభజన చట్టంలోని హామీలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతివరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) దాదాపు సిద్ధమైందని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ హైవే పూర్తయితే హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రయాణ సమయం కేవలం మూడు గంటలకే పరిమితమవుతుందని అంచనా.
ఈ హైవే పల్నాడు జిల్లాలోని పులిపాడు, దాచేపల్లి, ముత్యాలంపాడు, మాచవరం, తురకపాలెం, మొర్జంపాడు వంటి ప్రధాన గ్రామాల మీదుగా వెళ్లనుంది. ప్రాజెక్ట్ రూపకల్పనలో భౌగోళిక పరిస్థితులు, భూమి అందుబాటు, పర్యావరణ అంశాలను పరిగణలోకి తీసుకుని మార్గం ఖరారు చేశారు. ఈ హైవేను ఆరు లేన్లుగా నిర్మించడానికి ప్రాథమిక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా భూమి సేకరణ ప్రక్రియ కూడా త్వరలో మొదలుకానుంది.
ఈ హైవే పూర్తయితే అమరావతి, హైదరాబాద్ మధ్య వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక కార్యకలాపాలు మరింత వేగం అందుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా, నార్కెట్పల్లి, గుంటూరు పరిసర ప్రాంతాలకు ఆర్థికాభివృద్ధి దిశగా ఇది పెద్ద బూస్ట్గా మారనుందని నిపుణులు చెబుతున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో రైతులకు, వ్యాపారవేత్తలకు లాజిస్టిక్ సౌకర్యాలు పెరుగుతాయి.
దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న భారతమాల ప్రాజెక్టులో భాగంగానే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఆమోదం లభించింది. ఇప్పటికే ప్రాజెక్టు సాంకేతిక సమీక్షలు పూర్తయ్యాయని, త్వరలో టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని సమాచారం. సుమారు 15,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
హైవే ప్రాజెక్టు మార్గంలో ఉన్న పల్నాడు జిల్లాకు చెందిన గ్రామాల ప్రజల్లో భారీ ఉత్సాహం నెలకొంది. రోడ్డు ద్వారా కనెక్టివిటీ పెరగడంతో తమ గ్రామాల అభివృద్ధికి దోహదం అవుతుందని వారు చెబుతున్నారు. భవిష్యత్తులో కొత్త పారిశ్రామిక సంస్థలు, వసతులు ఈ ప్రాంతాల్లో పెరగనున్నాయని అంచనా. మొత్తానికి, హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు కేవలం రహదారి మాత్రమే కాదు, రెండు రాజధానులను కలిపే వృద్ధి మార్గంగా నిలవనుంది.