Deepam Scheme Subsidy: రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాను మరింత మెరుగుపరచడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. సచివాలయంలో ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో కీలక సూచనలు చేశారు. అంతర్జాతీయంగా యుద్ధాల వల్ల ఎల్పీజీ గ్యాస్ దిగుమతిలో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించాలంటే, పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వాడకాన్ని పెంచడమే సరైన మార్గమని స్పష్టం చేశారు. సిలిండర్ల కోసం ఎదురుచూసే పని లేకుండా నేరుగా ఇంటికే పైపుల ద్వారా గ్యాస్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
దీపం లబ్ధిదారులకు శుభవార్త.. రాయితీ యథాతథం
సాధారణంగా దీపం పథకం లబ్ధిదారులు పీఎన్జీ కనెక్షన్ తీసుకుంటే తమకు వచ్చే ఉచిత సిలిండర్ల రాయితీ ఎక్కడ పోతుందోనని భయపడుతుంటారు. దీనిపై సీఎం క్లారిటీ ఇచ్చారు. పీఎన్జీ కనెక్షన్ తీసుకున్నప్పటికీ దీపం పథకం ప్రయోజనాలు యథాతథంగా అందుతాయని, ఆ రాయితీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి, భయాందోళనలు తొలగించాలని పేర్కొన్నారు.
ఆరు నెలల్లో 10 లక్షల కనెక్షన్లే లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా పీఎన్జీ నెట్వర్క్ను విస్తరించడంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాబోయే ఆరు నెలల కాలంలో కనీసం 10 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని ఆయిల్ కంపెనీలకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. సిలిండర్ల పంపిణీలో ఉన్న సమస్యలను ఇప్పటికే చాలా వరకు తగ్గించామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. త్వరలోనే పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతీ ఇంటికి సురక్షితమైన గ్యాస్ అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కేంద్ర మంత్రితో చర్చలు పైప్లైన్ పనులకు గ్రీన్ సిగ్నల్
శ్రీకాకుళం నుండి కాకినాడ వరకు జరగాల్సిన నేచురల్ గ్యాస్ పైప్లైన్ పనుల్లో జాప్యంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని అధికారులు చెప్పడంతో, ఆయన వెంటనే స్పందించారు. సమీక్ష జరుగుతుండగానే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగిసినందున, పనులను త్వరగా పూర్తి చేసేలా సహకరించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సురక్షితమైన ఇంధనం వైపు అడుగులు
సిలిండర్ల కంటే పీఎన్జీ ఎంతో సురక్షితమైనదని, పైగా తక్కువ ధరకే లభిస్తుందని ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్యాస్ అయిపోతుందనే ఆందోళన లేకుండా నిరంతర సరఫరా ఉండటం వల్ల గృహిణులకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామికంగా, గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చంద్రబాబు వివరించారు. వచ్చే రోజుల్లో అన్ని ప్రధాన పట్టణాల్లో ఈ పైపులైన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.