Nara Lokesh Bangalore Visit: ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలుగు దేశం పార్టీ అభిమానులు, నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు పార్టీ జెండాలు, ప్లకార్డులతో హోరెత్తించారు. "లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి" అంటూ చేసిన నినాదాలతో విమానాశ్రయ ప్రాంగణం మార్మోగిపోయింది.
అనంతరం ఆయన బెంగళూరులోని సర్జాపూర్ రోడ్డులో ఉన్న ప్రముఖ గ్రీన్ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్కు చేరుకున్నారు. అక్కడ జరిగిన ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల యాజమాన్యం ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికింది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యార్థుల వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంత్రి తన చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సర్టిఫికెట్లు అందుకున్న విద్యార్థులను ఆయన అభినందించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా, ప్రస్తుత ప్రపంచ పోటీని తట్టుకునేలా సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని l సూచించారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ.. ఐటీ సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను వివరించారు. భవిష్యత్తులో ఐటీ రంగానికి యువత అవసరం ఎంతో ఉందని, విద్యార్థులు పట్టుదలతో శ్రమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా రాణించవచ్చని ధీమా వ్యక్తం చేశారు.
గ్రీన్ఉడ్ హై స్కూల్ యాజమాన్యం మంత్రి లోకేష్ను ప్రత్యేకంగా సత్కరించింది. ఈ పర్యటనలో మంత్రి వెంట పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, బెంగళూరులోని తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. లోకేష్ పర్యటనతో అటు పార్టీ కార్యకర్తల్లోనూ, ఇటు విద్యార్థుల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. విద్యా రంగంలో మార్పులు తీసుకురావడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.