ఆంధ్రప్రదేశ్లో భూముల రీసర్వే ప్రక్రియ కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూముల సర్వేలో అనేక తప్పులు చోటు చేసుకున్నాయని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ తప్పుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతూ, వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం రీసర్వేకు శ్రీకారం చుట్టింది.
ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే ప్రారంభం కానుంది. జనవరి 2వ తేదీ నుంచి ఈ నాలుగో విడత రీసర్వే చేపట్టనున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పూర్తి కచ్చితత్వంతో సర్వే నిర్వహించాలని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
నాలుగో విడత రీసర్వే కింద జిల్లాలోని ఎంపిక చేసిన 63 గ్రామాల్లో సర్వే జరగనుంది. మొత్తం 182 రోజుల్లోగా ఈ రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు షెడ్యూల్ను విడుదల చేశారు. గ్రామసభల ద్వారా రైతులకు ఇప్పటికే రీసర్వేపై అవగాహన కల్పిస్తున్నారు.
వైసీపీ హయాంలో జరిగిన సర్వేలో విస్తీర్ణం తప్పులు, జాయింట్ ఎల్పీ నంబర్ల సమస్యలతో రైతులు ఇబ్బంది పడ్డారని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో పక్కా కొలతలతో భూములను గుర్తించి, ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేలా తాజా రీసర్వే నిర్వహించనున్నారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 733 గ్రామాలకు గాను ఇప్పటికే 488 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది.
తాజా రీసర్వే పూర్తైన తర్వాత రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయనున్నారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన ఈ పాసుపుస్తకాల్లో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ కారణంగానే కొన్నిచోట్ల ప్రక్రియ ఆలస్యమవుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.