మాతృ భాషపై మమకారం పెంచేలా... తెలుగు వైభవం చాటిచెప్పిన మహనీయులను గుర్తుకు తెచ్చుకునేలా.. మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా.. గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా జరుగుతున్నాయి.
ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు శివారులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో ఏర్పాటు చేసిన మహాసభలకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, టి.డి.జనార్ధన్, జస్టిస్ మానవేంద్ర రాయ్, తమిళనాడు నేత గోపీనాథ్ తదితరులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అతిథులకు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు.
పిల్లలకు మాతృభాషను దూరం చేయొద్దు: జస్టిస్ ఆకుల శేషసాయి
“సందేశం ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు.. నాలుగు అమ్మ మాటలు వినటానికి వచ్చా. మాతృభాషను విస్మరిస్తే ఆ జాతి మనుగడ కష్టం. అమ్మను, అమ్మ భాషని గౌరవించే వాళ్లు ఎప్పటికీ తప్పు చేయరు. పిల్లలను మాతృభాషకు దూరం చేయొద్దు. అమ్మ భాషను భావితరాలకు అందించాలి” అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి అన్నారు.
తెలుగు భాష కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు: టి.డి.జనార్థన్
"చాలామంది ఇతర దేశాల్లో తెలుగు భాష కోసం సంఘాల నడుపుతున్నారు. అలాంటి అభిమానులంతా ఈ మహాసభలకు హాజరయ్యారు. ప్రపంచంలో తెలుగువారు లేని దేశం లేదు. తెలుగువారి కోసం, తెలుగు భాష కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు. ఆయన చేసిన కృషిని సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారు. మనమంతా అమ్మ భాష అభివృద్ధికి కృషి చేయాలి.
తెలుగు మహాసభల లాంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచంలో తెలుగు భాష ఔన్నత్యాన్ని ఘనంగా చాటాలి. సినిమాల్లో కూడా తెలుగు భాష అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారు. అనేక దేశాల్లో తెలుగును రెండో భాషగా బోధిస్తున్నారు. మాతృభాష మనుగడలో ఉన్నప్పుడు మాత్రమే మన ఉనికి ఉంటుంది. పాఠశాలల్లో పిల్లలు ఆంగ్లం మాట్లాడినప్పటికీ ఇంట్లో మాత్రం తెలుగు మాట్లాడేలా చూడాలి” అని తెదేపా నేత టి.డి.జనార్థన్ అన్నారు.
తెలుగు భాష పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: జస్టిస్ మానవేంద్ర రాయ్
"తెలుగు మహాసభలకు హాజరు కావడానికి తొలుత సంకోచించా. ఉద్యోగరీత్యా ఆంగ్లంతో ఎక్కువ సంబంధం ఉంటుంది. అందువల్ల తెలుగులో మాట్లాడడం తక్కువగా ఉంటుంది. బ్రిటిష్ వారి పరిపాలన వల్ల చట్టాలన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయి. వైద్య విద్య కూడా ఆంగ్లంలోనే కొనసాగుతోంది. బ్రిటిష్ వారు వెళ్లిపోయినా.. వారి భాషను మనం కొనసాగించడం వల్ల ఆంగ్లం మనం జీవితంలో భాగమైంది.
ఆంగ్ల భాష ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలి. గుజరాత్లో ప్రభుత్వ పరమైన అన్ని అంశాలు గుజరాతీ భాషలోనే ఉంటాయి. ప్రభుత్వ పరమైన విధానాల వల్ల మార్పు సాధ్యం. మాతృభాషను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయం. కేవలం ఈ మూడు రోజులు మహాసభల ద్వారానే కాకుండా భాషా పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.