ఆంధ్రప్రదేశ్లో క్రీడా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసి, వారికి మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలో స్టేడియంల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో క్రీడారంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
ఈ ప్రయత్నాల్లో భాగంగా తిరుపతిలో అత్యాధునిక స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. తిరుపతిలోని శ్రీశ్రీనివాస క్రీడా సముదాయంలో రూ.5 కోట్ల వ్యయంతో ఈ అకాడమీని నిర్మిస్తున్నారు. శుక్రవారం శాప్ (SAAP) ఛైర్మన్ రవి నాయుడు ఈ స్పోర్ట్స్ అకాడమీకి శంకుస్థాపన చేశారు. జూన్ నాటికి పనులు పూర్తిచేసి అకాడమీని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ స్పోర్ట్స్ అకాడమీని జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందిస్తున్నామని శాప్ ఛైర్మన్ రవి నాయుడు వెల్లడించారు. పటియాలా తర్వాత దేశంలోనే ముఖ్యమైన సమగ్ర శిక్షణ కేంద్రంగా తిరుపతి స్పోర్ట్స్ అకాడమీ నిలుస్తుందని ఆయన అన్నారు. ఇందులో సుమారు 200 మంది క్రీడాకారులకు వసతి కల్పించే హాస్టల్, వెయిట్ లిఫ్టింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్తో పాటు బ్యాడ్మింటన్, జూడో, లాన్ టెన్నిస్, చెస్ వంటి ఆటలకు ఇండోర్, అవుట్డోర్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
యువ క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని రవి నాయుడు తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న మల్టీ స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ ఆధునిక వసతులు, ప్రొఫెషనల్ కోచింగ్తో సమగ్ర శిక్షణ అందిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం నుంచి భవిష్యత్ ఛాంపియన్లు వెలువడే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దామినేడులో స్పోర్ట్స్ సిటీ కోసం ఇప్పటికే 28.37 ఎకరాల భూమిని శాప్కు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా తిరుపతిని ఆధ్యాత్మిక నగరంతో పాటు క్రీడా కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలన్న దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టమైన అడుగులు వేస్తోంది.