భారీ ఎగుమతి లక్ష్యానికి కేంద్రం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం..
ఎగుమతుల మిషన్కు ఐటీ ఆధారిత పర్యవేక్షణ..
కేంద్ర ప్రభుత్వం ఎగుమతుల రంగంలో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2030-31 నాటికి మొత్తం ఎగుమతులను 2 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందులో 1 ట్రిలియన్ డాలర్లు సరుకుల (మెర్చండైజ్) ఎగుమతులు, మరో 1 ట్రిలియన్ డాలర్లు సేవల ఎగుమతుల రూపంలో సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
న్యూఢిల్లీ లో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ లక్ష్య సాధనకు రూపొందించిన కార్యాచరణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మూడు ప్రధాన స్థంభాలపై దృష్టి సారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి రంగానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు, ఖచ్చితమైన గడువులు నిర్ధేశించడం, ప్రతి చర్యను సంబంధిత జాయింట్ సెక్రటరీకి బాధ్యతగా అప్పగించడం, అలాగే వాటిని సరఫరా (Supply-side), డిమాండ్ (Demand-side) అంశాలుగా విభజించడం వంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి.
ఇక ప్రతి కార్యక్రమాన్ని కీలక పనితీరు సూచికలతో (KPIs) అనుసంధానం చేసి, తక్కువ, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేయాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఐటీ ఆధారిత మానిటరింగ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఇందులో ప్రగతిని నిరంతరం ట్రాక్ చేయడం, అవసరమైతే ఉన్నతస్థాయిలో సమీక్షకు స్వయంచాలక విధానం ఉండాలని చెప్పారు.
అదేవిధంగా MSME రంగాన్ని ప్రోత్సహించే ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (Export Promotion Mission - EPM) అమలు పరిస్థితిని కూడా మంత్రి పరిశీలించారు. ముఖ్యంగా వ్యవసాయ ఎగుమతులు మరియు సూక్ష్మ, చిన్న పరిశ్రమల అభివృద్ధి ఈ మిషన్లో కీలకంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ను కేవలం ఎగుమతి ప్రోత్సాహక మండళ్లకే పరిమితం చేయకుండా, ప్రాతినిధ్య స్థాయిలో పనిచేసే ఇతర సంస్థలకు కూడా విస్తరించాలని మంత్రి సూచించారు. ఈ చర్యల ద్వారా భారత ఎగుమతుల రంగం మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.