నిర్వాసితులకు రూ.307 కోట్లు పంపిణీతో పాటు పట్టాల పంపిణీ..
పోలవరం నిర్వాసితుల కుటుంబాల్లో పండుగ వాతావరణం..
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక భరోసా ఇవ్వనున్నారు. సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్అండ్ఆర్ (రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) ప్యాకేజీ కింద భారీ స్థాయిలో పరిహారం పంపిణీ చేయనున్నారు.
మొత్తం 1,527 మంది లబ్దిదారులకు రూ.307 కోట్ల పరిహారం అందజేయడంతో పాటు, పలు కుటుంబాలకు భూ పట్టాలను కూడా సీఎం పంపిణీ చేయనున్నారు. ఈ నిర్ణయంతో పోలవరం నిర్వాసితుల కుటుంబాల్లో ఆనంద వాతావరణం నెలకొంది.
పోలవరం ప్రాజెక్టు కారణంగా ఇళ్లను, భూములను కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే నాలుగు విడతల్లో 28,673 మంది నిర్వాసితులకు సుమారు రూ.2,250 కోట్ల పరిహారం పంపిణీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, “పోలవరం నిర్వాసితుల కుటుంబాల్లో పండుగ వాతావరణం తీసుకువచ్చాం. గత వైసీపీ పాలనలో పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా బాధితులను పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాధ్యతగా ముందుకొచ్చి వారికి అండగా నిలుస్తోంది” అని పేర్కొన్నారు.
నిర్వాసితుల పునరావాసం, జీవనోపాధి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి అర్హ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.