- ఏఐ చిత్రాలతో మిస్సైల్ దాడులు, అంతరిక్ష యుద్ధం దృశ్యాల ప్రదర్శన..
- North America: ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ప్రతిష్టంభన..
Donald Trump: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా దూకుడును ప్రదర్శించారు. తన అధికారిక 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫామ్లో ఇరాన్ను హెచ్చరిస్తూ, ఆ దేశాన్ని రెచ్చగొట్టేలా ఉన్న కృత్రిమ మేధస్సు (AI) చిత్రాలను ఆయన వరుసగా పోస్ట్ చేయడం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పశ్చిమాసియాలో ఇప్పటికే రగులుతున్న యుద్ధ జ్వాలలను ఈ వివాదాస్పద పోస్టులు మరింతగా పెంచేలా ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్ 20కి పైగా ఏఐ ఆధారిత చిత్రాలను పంచుకోగా, వాటిలో అత్యధిక భాగం ఇరాన్పై అమెరికా సైన్యం జరపబోయే భీకర దాడులను ప్రతిబింబించేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ దేశ పటాన్ని అమెరికా జెండాతో పూర్తిగా కప్పివేసి, దాని చుట్టూ బాణాలు గురిపెట్టినట్లు ఉన్న ఒక చిత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. అలాగే ఇరాన్ ఫాస్ట్ బోట్లపై అమెరికా డ్రోన్లు విరుచుకుపడుతున్న ఒక విజువల్ కింద "బై బై, ఫాస్ట్ బోట్స్" అని ట్రంప్ క్యాప్షన్ జోడించారు. అంతటితో ఆగకుండా, తాను స్వయంగా ఒక కంప్యూటర్ ముందు కూర్చుని టేబుల్పై క్లిక్ చేస్తూ "బా బా బా బా... ఫైర్, బూమ్" అంటూ క్షిపణి దాడులకు ఆదేశాలిస్తున్నట్లు ఉన్న ఒక వీడియోను సైతం షేర్ చేశారు. వీటితో పాటు అంతరిక్షం నుంచి క్షిపణి దాడులను నిశితంగా పర్యవేక్షిస్తూ, ఒక హైటెక్ స్పేస్క్రాఫ్ట్లో 'కిల్ బటన్' నొక్కుతున్నట్లు సృష్టించిన చిత్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ డిజిటల్ హెచ్చరికల వెల్లువకు సరిగ్గా కొద్దిసేపటి ముందే ట్రంప్ ఇరాన్ పాలకులకు అత్యంత కఠినమైన తుది గడువును విధించారు. ఇరాన్కు సమయం క్రమంగా మించిపోతోందని, ఆ దేశం గనుక వేగంగా శాంతి ఒప్పందం వైపు అడుగులు వేయకపోతే, భవిష్యత్తులో వారి ఉనికి కూడా ఉండదంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దళాలు ఇరాన్పై భారీ ఎత్తున దాడులు ప్రారంభించినప్పటి నుంచి పశ్చిమాసియా ప్రాంతం రణరంగంగా మారింది. ఈ యుద్ధాన్ని ముగించేందుకు వాషింగ్టన్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అవి ఏమాత్రం ఫలించడం లేదు. ఈ ఘర్షణల కారణంగా అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి పూర్తిగా దిగ్బంధనంలోకి వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం చమురు ఎగుమతుల్లో సుమారు 20 శాతం వాటా ఈ వ్యూహాత్మక మార్గం గుండానే జరుగుతుంది కాబట్టి, ఈ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
మరోవైపు ఇరాన్ సైతం అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. పొరుగు దేశమైన లెబనాన్లో సంపూర్ణ మరియు శాశ్వత కాల్పుల విరమణ జరిగే వరకు తాము డొనాల్డ్ ట్రంప్తో ఎలాంటి శాంతి ఒప్పందాల పైన సంతకాలు చేయబోమని టెహ్రాన్ వర్గాలు స్పష్టం చేశాయి. తాను విధించిన కఠినమైన షరతులకు ఇరాన్ ఏమాత్రం లొంగకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనానికి గురవుతున్నారని, అందువల్లే సోషల్ మీడియా వేదికగా ఇటువంటి పరోక్ష మానసిక యుద్ధాన్ని ప్రకటిస్తూ ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.