- స్టాలిన్ త్వరలోనే సీఎం అవుతారని అనితా రాధాకృష్ణన్ ధీమా..
- కొళత్తూర్ ఓటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు..
Vijay: తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూటమి ప్రభుత్వం కనీసం ఆరు నెలలు కూడా అధికారంలో కొనసాగలేదని డీఎంకే సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అత్యంత త్వరలోనే మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ తమిళనాడులో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న రాధాకృష్ణన్.. అధికార టీవీకే సీనియర్ నేత, విల్లివాక్కం ఎమ్మెల్యే ఆధవ్ అర్జునకు బహిరంగ సవాల్ విసిరారు. ప్రస్తుత విజయ్ ప్రభుత్వం మరో నాలుగు నెలలు మాత్రమే మనుగడ సాగిస్తుందని జోస్యం చెప్పిన ఆయన, ఆధవ్ అర్జునకు ధైర్యం ఉంటే తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, తాను కూడా రాజీనామా చేసి ఇద్దరం తిరుచెందూర్లో తలపడదామని సవాల్ విసిరారు. తిరుచెందూర్ తమ అడ్డా అని, అక్కడ ఎవరినైనా ఓడించే సత్తా తమకుందని వ్యాఖ్యానించారు. గత 25 ఏళ్లుగా తిరుచెందూర్ స్థానం రాధాకృష్ణన్కు బలమైన కోటగా కొనసాగుతుండడం గమనార్హం.
ఈ సందర్భంగా కొళత్తూర్ నియోజకవర్గ స్థానంలో మాజీ డీఎంకే నేత, ప్రస్తుతం టీవీకే తరపున పోటీ చేసిన వీఎస్ బాబు చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన ఎంకే స్టాలిన్ను రాధాకృష్ణన్ గట్టిగా వెనకేసుకొచ్చారు. కొళత్తూర్ నియోజకవర్గాన్ని స్టాలిన్ ఒక సింగపూర్లా మార్చారని కొనియాడుతూనే, అక్కడి ఓటర్లను ఉద్దేశించి ‘పనికిరానివారు’ అంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమ అగ్రనేత స్టాలిన్ తదుపరి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఈసారి ఆయనను తిరుచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తామని రాధాకృష్ణన్ స్పష్టం చేశారు.
తమిళనాడు రాజకీయ ప్రస్థానంలో దశాబ్దాల తర్వాత సాంప్రదాయ ద్రవిడ పార్టీల హవాకు బ్రేక్ పడి, సరికొత్త పార్టీ అధికారం చేపట్టడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకుగానూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఒంటరిగానే 108 సీట్లు సాధించి, మిత్రపక్షాలతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా గత 62 ఏళ్లుగా తమిళనాడును మార్చి మార్చి పాలిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల జోరుకు విజయ్ గట్టి బ్రేక్ వేశారు. ఈ సున్నితమైన రాజకీయ నేపథ్యంలో డీఎంకే సీనియర్ నేత అనితా రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, ప్రభుత్వం కూలిపోతుందంటూ ఆయన చేసిన ఈ ఘాటు విమర్శలపై ఇప్పటి వరకు టీవీకే శ్రేణులు లేదా ముఖ్యమంత్రి విజయ్ వర్గం అధికారికంగా స్పందించలేదు.