ఆసియా కప్ 2025లో టీమిండియా తనదైన శైలిలో దూసుకుపోతోంది. నిన్న జరిగిన సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్పై 41 పరుగుల తేడాతో గెలిచి నేరుగా ఫైనల్లో స్థానం దక్కించుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 168 పరుగులు చేసింది. అనంతరం విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఒక దశలో రాణిస్తుందని అనిపించినా, చివరికి 127 పరుగులకే ఆలౌట్ అయింది.
భారత్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడం ఈ విజయానికి ప్రధాన కారణమని చెప్పాలి. ప్రారంభంలోనే బుమ్రా తన వేగం, లెంగ్త్తో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ను గట్టిగా ఇబ్బంది పెట్టాడు. తన మొదటి ఓవర్లలోనే ఒక వికెట్ తీసి ప్రత్యర్థి ఆరంభాన్ని దెబ్బతీశాడు. అనంతరం కుల్దీప్ యాదవ్ తన మాయా బౌలింగ్తో కీలక వికెట్ సాధించాడు. దీంతో బంగ్లాదేశ్ రన్రేట్ క్రమంగా పడిపోవడంతో ఆటగాళ్లలో ఒత్తిడి పెరిగింది.
తరువాత అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కూడా వికెట్లు తీశారు. మధ్యలో జాకర్ అలీ రన్ అవుట్ కావడంతో బంగ్లాదేశ్ ఆశలు మరింత దెబ్బతిన్నాయి.
ఈ క్రమంలో సైఫ్ హసన్ ఒక్కరే కొంత ప్రతిఘటన చూపించాడు. కానీ అదృష్టం అతనికి కూడా కలసి రాక, అక్షర్ పటేల్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో అతని ఇన్నింగ్స్ కూడా ముగిసిపోయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పూర్తిగా కుప్పకూలింది.
స్టేడియంలో మాత్రం బంగ్లాదేశ్ అభిమానులు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ, భారత్పై గెలుస్తామనే నినాదాలు చేశారు. 2007లో సాధించిన విజయాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ ఈసారి కూడా వారికి నిరాశే మిగిలింది.