ఆంధ్రప్రదేశ్ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంలో మరో సానుకూల నిర్ణయం తీసుకుంది. స్త్రీ శక్తి పథకం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ఆగస్ట్ 15న విజయవాడలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అప్పటి నుంచి పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. మొదట్లో ఘాట్ రోడ్లలో ఈ సదుపాయం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఉచిత బస్సు సౌకర్యం లభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు చూపించి ఉచిత ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించబడింది.
అయితే ఆధార్ కార్డు అన్ని పథకాలకు ప్రామాణికంగా మారడంతో, ఉచిత బస్సు పథకానికి కూడా ఆధార్ చూపించడం తప్పనిసరి అయ్యింది. ఇప్పటివరకు మహిళలు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును కండక్టర్కి చూపించాల్సి ఉండేది. ఆధార్ చూపిన తర్వాత RTC సిబ్బంది జీరో ఫేర్ టికెట్ ఇస్తారు. ఆ టికెట్పై ప్రయాణ దూరం, ప్రభుత్వం కల్పించిన లబ్ధి వివరాలు ముద్రించబడతాయి. ఇప్పుడు ప్రభుత్వం మరింత సౌకర్యం కల్పిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించకపోయినా, మొబైల్ ఫోన్లో ఉన్న ఆధార్ కార్డు లేదా డిజిలాకర్ ద్వారా చూపించినా ఉచిత బస్సు సౌకర్యం లభిస్తుంది. దీనికి సంబంధించి RTC డిపో మేనేజర్లకు ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని RTC అధికారులు చెబుతున్నారు. పురుషుల కంటే ఇప్పుడు మహిళలే ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, ఫలితంగా బస్సుల ఆక్యుపెన్సీ పెరిగిందని వెల్లడించారు. అయితే కొన్ని చోట్ల సీట్ల కోసం గొడవలు జరుగుతున్నప్పటికీ, మొత్తం మీద స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ పథకం వల్ల ముఖ్యంగా గ్రామీణ మహిళలకు రవాణా ఖర్చు తగ్గి, ఉద్యోగాలు, విద్య, వ్యాపారం వంటి విషయాల్లో చాలా సౌలభ్యం కలుగుతోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల మహిళలకు మరింత సౌకర్యం కలిగిందని భావిస్తున్నారు. ఎప్పుడూ ఒరిజినల్ ఆధార్ వెంట తీసుకెళ్లలేని పరిస్థితుల్లో, మొబైల్లో చూపించడం పెద్ద సాయం అవుతుంది. ప్రత్యేకించి డిజిటల్ సౌకర్యాలను ఉపయోగించే మహిళలకు ఈ నిర్ణయం ఒక బిగ్ రిలీఫ్గా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ సౌకర్యవంతమైన చర్య స్త్రీ శక్తి పథకాన్ని మరింత విస్తృతంగా, విజయవంతంగా కొనసాగించేందుకు దోహదం చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.