కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ సరికొత్త టెక్నాలజీని అమలు చేస్తోంది. భక్తుల రద్దీ నియంత్రణ, వసతి సౌకర్యాలు, భద్రతా చర్యలు మెరుగుపరిచే లక్ష్యంతో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 25న ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. వైకుంఠం-1 కాంప్లెక్స్లో ఎన్నారైల దాతృత్వంతో రూ.30 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ దేశంలోనే తొలిసారిగా ఏఐ టెక్నాలజీ ఆధారంగా నిర్మించబడింది. గత అక్టోబరులో అమెరికాలో ఉన్నప్పుడు మంత్రి లోకేష్కు కొన్ని ఎన్నారైలు ఈ ఆలోచన వివరించగా, వారే దీని కోసం విరాళం ఇచ్చి ముందడుగు వేశారు.
ఈ ఐసీసీసీ ద్వారా భక్తుల రద్దీని క్షణక్షణం పర్యవేక్షిస్తారు. అలిపిరి నుంచి మొదలుకొని క్యూలైన్ల వరకు ఎంతమంది ఉన్నారు, ఎంత సమయం వేచి ఉన్నారు, సర్వదర్శనం పరిస్థితి ఎలా ఉందన్న అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను 25 మందికి పైగా సిబ్బంది రియల్ టైమ్లో పర్యవేక్షిస్తారు. రద్దీగా ఉన్న ప్రాంతాలను 3డీ మ్యాప్లు, రెడ్ స్పాట్ల రూపంలో చూపించి వెంటనే చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షిత మార్గాల ద్వారా బయటకు తీసుకువెళ్లే ఏర్పాట్లు కూడా ఇందులో ఉంటాయి.
ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో భక్తులను గుర్తించడంతో పాటు, తప్పిపోయిన వారిని సులువుగా కనుగొనవచ్చు. చోరీలు, నేరాలు జరిగినా వెంటనే గుర్తించడం సులభం అవుతుంది. భక్తుల ముఖ కవళికలను విశ్లేషించి వారికి ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అంచనా వేయవచ్చు. మరోవైపు సైబర్ దాడులను అడ్డుకోవడంలోనూ ఈ సెంటర్ కీలకంగా పనిచేస్తుంది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం, పోస్టులను నిరోధించే ఏర్పాట్లు కూడా ఈ వ్యవస్థలో భాగంగా ఉంటాయి.
భక్తులకు సౌకర్యవంతమైన దర్శన అనుభవం కలిగించడమే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రధాన లక్ష్యం. దర్శనానికి వచ్చే వారి అనుభవాలను విశ్లేషించి, వసతి, రవాణా, భద్రతా చర్యలను మరింత మెరుగుపరచనుంది. ఇకపై భక్తులు ఎంత సమయం వేచి చూడాలో, ఏ ప్రాంతాల్లో రద్దీ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. దర్శనాన్ని మరింత సులభతరం చేసి, భక్తుల సౌకర్యార్థం ఆధునిక టెక్నాలజీని వినియోగించడంలో టీటీడీ ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఇదే మోడల్గా నిలిచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.