ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం సీఆర్డీఏ ఇంజినీర్లతో కలిసి ఐకానిక్ టవర్స్, హ్యాపీనెస్ట్, నేలపాడు ప్రాంతాల్లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు మరియు గ్రూప్-డి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న వసతి భవన సముదాయాల పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “రాజధానిలో ఎలాంటి పనులు జరగడంలేదన్న వాదనలు అసత్యం. ప్రజలు అటువంటి దుష్ప్రచారాలను నమ్మకూడదు. మేము రాజధాని అభివృద్ధిని తక్కువ వ్యవధిలోనే పూర్తి చేయాలని సంకల్పించాం. మూడేళ్లలో అన్ని ప్రధాన నిర్మాణ పనులను పూర్తి చేస్తాం" అని మంత్రి నారాయణ తెలిపారు.
అమరావతిలో విద్యా రంగాన్ని మెరుగుపరిచే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ప్రముఖ విశ్వవిద్యాలయాలైన వీఐటీ (VIT), ఎస్ఆర్ఎం (SRM) త్వరలో 50 పడకల సామర్థ్యంతో రెండు వైద్య కళాశాలలను స్థాపించనున్నాయని చెప్పారు. ఈ కళాశాలలు వచ్చే మార్చి నాటికి పూర్తై ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అలాగే ఆయా విశ్వవిద్యాలయాలు రెండు సీబీఎస్ఈ ప్రమాణాల పాఠశాలల్ని కూడా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
రాజధాని భూములు ఇచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభించనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. “ప్లాట్ల అభివృద్ధికి అవసరమైన టెండర్లు పూర్తయ్యాయి. త్వరలోనే మౌలిక వసతుల పనులు ప్రారంభిస్తాం” అని చెప్పారు.
ప్రధాన రహదారుల నిర్మాణంపై కూడా మంత్రి విశేష దృష్టి సారించారు. మొత్తం 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లతో పాటు 1500 కిలోమీటర్ల లేఔట్ రోడ్లను నిర్మించాల్సి ఉందని తెలిపారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం కొండవీడు ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి, పాలవాగుల పారిశుద్ధ్య, మౌలిక వసతుల పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు.
ప్రభుత్వం రాజధాని అభివృద్ధిపై పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని, ప్రజల సహకారంతో అమరావతిని ఒక నమూనా రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతామని మంత్రి నారాయణ అన్నారు.