పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. 2023 నుంచి వివిధ కేసుల్లో అడియాలా జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆందోళనల సందర్భంగా పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువగా ఉండగా, మొత్తం 500 మందికి పైగా పీటీఐ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినట్టు పార్టీ వర్గాలు ఆరోపించాయి. జైల్లో ఇమ్రాన్ ఖాన్కు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నిరసనలు నిర్వహించినట్టు పీటీఐ నేతలు తెలిపారు.
ఇమ్రాన్ ప్రాథమిక హక్కులను ప్రభుత్వం హరించిందని, ఆయనను న్యాయవాదులు లేదా కుటుంబ సభ్యులు కూడా కలవడానికి అనుమతించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం హైవేలను మూసివేయడం, పీటీఐ జెండాలతో ఉన్న వాహనాలను ఆపడం వంటి చర్యలకు దిగిందని పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల ప్రతినిధి బుఖారీ విమర్శించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులను పాకిస్థాన్లో ప్రభుత్వం నాశనం చేస్తోందని, ప్రజలపై నియంతృత్వంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.