Technology News: టెక్నాలజీ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపు దూసుకెళ్తోంది. మనం చేసే పని, మాట్లాడే తీరు, రాసే పద్ధతి అన్నీ ఏఐ ఆధారంగా మారిపోతున్న ఈ సమయంలో ఓపెన్ఏఐ నుంచి భారత్ యూజర్లకు ఒక పెద్ద సర్ప్రైజ్ వచ్చింది.
ఈ సంస్థ తాజాగా ప్రకటించిన చాట్జీపీటీ గో సేవలను భారత వినియోగదారులకు ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. ఈ ఫ్రీ ఆఫర్ నవంబర్ 4 నుంచి అమల్లోకి రానుంది.
చాట్జీపీటీ గో అనేది సాధారణ ఫ్రీ వెర్షన్ కంటే మెరుగైనది. ఇది చాట్జీపీటీ ప్లస్ (రూ. 1999 నెలకు) కంటే చవకైన మధ్యస్థ ప్లాన్. ఈ ఏడాది ఆగస్టులో రూ. 399 నెలకు లాంచ్ చేయగా, ఇప్పుడు దాన్ని ఏడాది పాటు ఉచితంగా అందిస్తామని ఓపెన్ఏఐ ప్రకటించింది.
ఇందులో యూజర్లకు మరిన్ని సౌకర్యాలు ఉంటాయి:
ఫ్రీ వెర్షన్ కంటే ఎక్కువ మెసేజ్లు పంపే అవకాశం.
ఇమేజ్లు, ఫైల్స్ అప్లోడ్ చేసే ఆప్షన్ 10 రెట్లు ఎక్కువ.
మెమరీ కెపాసిటీ కూడా రెట్టింపు. ఇవి అన్నీ కలిపి యూజర్కి మరింత వేగంగా, స్మార్ట్గా పనిచేసే ఏఐ అనుభవాన్ని ఇస్తాయి.
ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ ఇటీవల భారత్ గురించి మాట్లాడుతూ ఇది మా రెండో అతిపెద్ద, వేగంగా ఎదుగుతున్న మార్కెట్ అని అన్నారు. భారతదేశంలో ఏఐ వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో సంస్థ ఇక్కడ తన స్థానాన్ని బలపరచాలని ప్రయత్నిస్తోంది.
ఏఐ రంగంలో ఇప్పటికే గూగుల్ జెమినీ, మెటా ఏఐ పర్ప్లెక్సిటీ వంటి కంపెనీలు యాక్టివ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాట్జీపీటీ గో ఉచిత ఆఫర్తో ఓపెన్ఏఐ నేరుగా పోటీని ఎదుర్కోవాలని చూస్తోంది.
గూగుల్ ఇప్పటికే విద్యార్థుల కోసం రూ. 19,000 విలువైన ఏఐ ప్రో సర్వీసులను ఉచితంగా అందిస్తోంది. పర్ప్లెక్సిటీ కూడా ఎయిర్టెల్తో కలిసి ప్రీమియం ప్లాన్ ఉచిత సదుపాయాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ కూడా యూజర్లను ఆకర్షించేందుకు చాట్జీపీటీ గోను ఫ్రీగా అందిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఏఐ సపోర్ట్తో ఖర్చు తగ్గించుకుని పనితీరును మెరుగుపరుస్తున్నాయి. టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్య తగ్గించి, బదులుగా ఏఐ టూల్స్పై పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ట్రెండ్ రాబోయే కాలంలో మరింత వేగం అందుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.