ఆంధ్రప్రదేశ్లో కీలక రైల్వే ప్రాజెక్టుగా పేరుగాంచిన నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం వేగం పెంచుకుంది. హైదరాబాద్ వైపు నుంచి ఏపీకి ప్రత్యామ్నాయ మార్గంగా చురుకుగా సాగుతున్న ఈ లైన్ నిర్మాణం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. కనిగిరి వరకు ట్రాక్ వేయడం పూర్తవుతుండగా, రైల్వే స్టేషన్లు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి.
దర్శి రైల్వే స్టేషన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. మెయిన్ ట్రాక్తో పాటు మూడు లూప్ లైన్లు సిద్ధమయ్యాయి. స్టేషన్లో టికెట్ కౌంటర్లు, తాగునీటి కోసం కుళాయిలు, ప్రయాణికుల కోసం బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. అధికారుల కోసం గెస్ట్ హౌస్, సిగ్నల్ ఆఫీస్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. స్టేషన్లో వెలుగు లైట్లు, పచ్చదనం కోసం మొక్కలతో గ్రీన్ సెట్అప్ చేస్తున్నారు. ప్రస్తుతం పనులు 90 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా ప్యాసింజర్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ ఏడాదిలోనే రైళ్లు పరుగులు తీయనున్నాయి.
ఈ రూట్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై వరకు ప్రయాణం మరింత వేగవంతమవుతుంది. మొత్తం 309 కిలోమీటర్ల లైన్ను ఐదు దశలుగా నిర్మిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని పొదిలి సమీప గార్లపేట వరకు (145 కిలోమీటర్లు) ట్రాక్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కేవలం 200 మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. ఇక పామూరు దిశగా టెండర్లు పూర్తవడంతో త్వరలోనే పనులు మొదలుకాబోతున్నాయి.
పేరంగుడిపల్లి వద్ద బ్రిడ్జ్ నిర్మాణం మాత్రం నేషనల్ హైవే పనుల అనంతరం చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రవాణా రంగానికి ఎంతగానో మేలు జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.