ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం పెద్ద ఊరటను కల్పిస్తోంది. ‘ఒక కుటుంబం - ఒక వ్యాపారి’ నినాదంతో స్వయం ఉపాధి అవకాశాలను విస్తరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), దీన్దయాళ్ జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కలిసి డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేస్తున్నారు. బ్యాంకుల ద్వారా లభించే రుణాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. మహిళలను ఎంఎస్ఎంఈలుగా రిజిస్ట్రేషన్ చేయించి చిన్న వ్యాపారాలు, యూనిట్ల కోసం సబ్సిడీతో రుణాలు ఇస్తున్నారు. ఉపాధి కోర్సుల్లో శిక్షణ కూడా అందిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన తృప్తి క్యాంటీన్లు డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఒక్కో క్యాంటీన్ ఏర్పాటుకు నలుగురు మహిళలు కలసి రూ.16.40 లక్షల పెట్టుబడి పెట్టాలి. నెలకు సుమారు రూ.6.39 లక్షల టర్నోవర్ వస్తూ, దాదాపు రూ.2.46 లక్షల లాభం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అంతేకాకుండా, అరకు కాఫీ కియోస్క్ మోడల్ స్టాల్స్, చాయ్రాస్తా ఏర్పాటుకు కూడా రుణాలు ఇస్తున్నారు. కాఫీ స్టాల్ కోసం రూ.2 లక్షలు, చాయ్రాస్తా కోసం రూ.8 లక్షల వరకు రుణం అందుబాటులో ఉంటుంది. సొంత స్థలం లేదా ప్రభుత్వ భూమి చూపిస్తే అనుమతులు ఇస్తారు.
డ్వాక్రా మహిళలకు ర్యాపిడో భాగస్వామ్యంతో ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ప్రభుత్వం బైక్లు, స్కూటీలు కొనుగోలు చేసేందుకు రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు, ఆటోలు కొనుగోలు చేసేందుకు రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు రుణాలు ఇస్తోంది. అదనంగా, ఎగ్ కార్టులు (రూ.50,000 విలువైనవి), ఫుడ్ ప్రాసెస్ యూనిట్లకు రుణాలు కూడా మంజూరు చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వందలాది డ్వాక్రా మహిళలు ఈ పథకాల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆసక్తి గల మహిళలు మెప్మా, వెలుగు అధికారులు లేదా ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.