ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సీడాప్ (Society for Employment Development in AP), డీడీయూ-జీకేవై (Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana) ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయి. డబ్బులు వెచ్చించి కోర్సులు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, నిరుద్యోగులు నైపుణ్యాలు పెంచుకొని ఉద్యోగాలు పొందేలా ఈ కార్యక్రమం రూపొందించారు.
ప్రస్తుతం వేర్హౌస్ సూపర్వైజర్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ ఇంజినీర్, రెస్టారెంట్ కెప్టెన్, మల్టీ స్కిల్ టెక్నీషియన్, ఫీల్డ్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్, ఆటోమేషన్ స్పెషలిస్ట్ తదితర రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు. ట్రైనింగ్ సమయంలో స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు కూడా నేర్పిస్తారు. అర్హతగా 10వ తరగతి, డిప్లమో, ఐటీఐ, డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఈ శిక్షణలో 90 రోజులపాటు క్లాసులు, 30 రోజులపాటు ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో ఫుడ్, హాస్టల్ వసతి ఉచితం, యూనిఫాం, షూ వంటి అవసరమైన వస్తువులు ఇస్తారు. శిక్షణ అనంతరం స్కిల్ ఇండియా సర్టిఫికేట్ ఇస్తారు. కోర్సు పూర్తయ్యాక పలు మల్టీనేషనల్ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు కల్పిస్తున్నారు.
ఉద్యోగాలు విశాఖపట్నం, తిరుపతి, శ్రీ సిటీ, పుణే, ఇతర నగరాల్లో లభిస్తాయి. ఒక్కొక్కరికి ట్రైనింగ్ తీసుకున్న కోర్సును బట్టి నెలకు రూ.36,000 నుంచి రూ.64,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంది. ఆసక్తిగల వారు ఇచ్చిన ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. ఈ ప్రోగ్రామ్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), సెంచూరియన్ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో మరింతమందికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.