మనీలాండరింగ్ కేసుతో పాటు ఉగ్రవాద కుట్రల ఆరోపణలతో పాకిస్థాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్పై చెన్నై ఎన్ఐఏ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు సమన్లు జారీ చేస్తూ, అక్టోబర్ 15న కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్లోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్లపై దాడులు చేయాలనే కుట్రలో జుబేర్ పాత్ర ఉందని సమన్లలో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు ఆయన కరాచీలోని చిరునామాను కూడా నోటీసుల్లో పొందుపరిచింది.
ఈ కేసులో మరో కీలక వ్యక్తి సిద్ధిఖీ. ఆయన శ్రీలంకలోని పాకిస్థాన్ హైకమిషన్లో వీసా కౌన్సిలర్గా పని చేశారు. 2018లో ఎన్ఐఏ ఆయన పేరును వాంటెడ్ జాబితాలో చేర్చి, ఫొటోను కూడా విడుదల చేసింది. దక్షిణ భారతదేశంలో 26/11 తరహా ఉగ్రదాడులు జరపాలన్న కుట్రలో సిద్ధిఖీ ప్రధాన సూత్రధారి అని అదే ఏడాది ఎన్ఐఏ ఛార్జీషీట్లో పేర్కొంది.
2009 నుంచి 2016 వరకు శ్రీలంకలో పనిచేసిన సమయంలో సిద్ధిఖీ ఉగ్రవాద నెట్వర్క్లతో, గూఢచార కార్యకలాపాల్లో నిమగ్నమైన వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు ఎన్ఐఏ తన దర్యాప్తులో గుర్తించింది. ఈ పరిణామాలు భారత భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేశాయి.
ఇక 2014లోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిద్ధిఖీ ఆదేశాల మేరకు భారత్లో విధ్వంసం సృష్టించడానికి వచ్చిన శ్రీలంక జాతీయుడు మహమ్మద్ సఖీర్ హుస్సేన్ చెన్నై పోలీసుల చెరలో చిక్కాడు. ఆ కేసులోనే తొలిసారి పాకిస్థాన్ దౌత్యవేత్తపై కేసు నమోదు అయింది. అనంతరం కేంద్ర హోంశాఖ ఆదేశాలపై ఆ కేసు ఎన్ఐఏకి బదిలీ చేయబడింది.