రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంకా తుది దశకు చేరుకోలేదు. ఇప్పటికే నాలుగు విడతలుగా ధ్రువపత్రాల పరిశీలన జరిగినప్పటికీ, కొంత గందరగోళం కొనసాగుతోంది. ఈ కారణంగా అభ్యర్థుల్లో అనిశ్చితి నెలకొంది. అయినప్పటికీ, తుది ఎంపిక జాబితాను సెప్టెంబరు 12న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది.
ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. సీఎం షెడ్యూల్ను బట్టి సెప్టెంబరు 15 తర్వాత ఎప్పుడైనా నియామక పత్రాల అందజేత కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. అభ్యర్థులకు ఇది చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన మెరిట్ జాబితా ప్రకారం మూడో విడత ధ్రువపత్రాల పరిశీలనలో 30 మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు. వారి స్థానంలో కొత్తవారిని పిలిచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయితే ఎంపికలపై స్పష్టత రానుంది. అధికారుల అంచనాల ప్రకారం ఈ ప్రక్రియ సజావుగా పూర్తయితే 16,347 టీచర్ పోస్టుల నియామకం తుది దశకు చేరుతుంది.
అయితే కొన్ని జిల్లాల్లో రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అభ్యర్థులు లేకపోవడంతో సుమారు 700 పోస్టులు ఖాళీగా మిగిలే అవకాశం ఉంది. ఈ పోస్టులను వచ్చే డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మొత్తం మీద, రాష్ట్రంలో టీచర్ నియామక ప్రక్రియపై వేలాది మంది అభ్యర్థుల దృష్టి కేంద్రీకృతమైంది.