శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో అధికారులు ఆ సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో వందలాది ప్రయాణికులు నిరాశకు గురయ్యారు.
ఉదయం 7.15 గంటలకు అలయన్స్ ఎయిర్లైన్స్ 9ఐ-877 విమానం 50 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరాల్సి ఉంది. అయితే రన్వేపై టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో ఇంజిన్లో సమస్య తలెత్తడంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, ముందుజాగ్రత్త చర్యగా ఆ సర్వీసును రద్దు చేశారు.
ఇక ఢిల్లీకి వెళ్లాల్సిన ఆకాశ ఎయిర్లైన్స్ క్యూపీ-1405 విమానంలో కూడా సాంకేతిక లోపం బయటపడింది. 200 మందికిపైగా ప్రయాణికులు బోర్డింగ్ పూర్తిచేసుకున్న సమయంలోనే ఫైర్ ఎగ్జాస్టింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో అధికారులు ఈ సర్వీసును రద్దు చేశారు. ప్రయాణికులకు టికెట్ రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ విమానంలో పంపిస్తామని భరోసా ఇచ్చారు.