విశాఖపట్నం ఆర్టీసీ ప్రయాణికులకు కొత్త బంపరాఫర్ను ప్రకటించింది. కేవలం రూ.100కే రోజంతా నగరంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. ‘ట్రావెల్ యాజ్ యూ లైక్’ అనే పేరుతో ఈ ప్రత్యేక టికెట్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్తో ఒకే రోజు పాస్లా ఉపయోగించుకుని, ఎన్ని సార్లయినా ప్రయాణం చేయవచ్చు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తోంది. అయితే కుటుంబంతో వచ్చినప్పుడు మిగిలిన సభ్యులకు ఈ రూ.100 టికెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పర్యాటకులకు ఇది ఒక పెద్ద బహుమతిగా మారనుంది. విశాఖపట్నం లోని పర్యాటక ప్రాంతాలను తక్కువ ఖర్చుతో సులభంగా చూడటానికి ఈ టికెట్ మంచి అవకాశం.
ఆర్టీసీ అధికారులు చెబుతున్నదాని ప్రకారం, ఈ టికెట్ కొనుగోలు ద్వారా ప్రజలు డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. ఒక రోజు మొత్తం ఉపయోగించుకునే వీలున్నందువల్ల నగర పరిధిలో ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగొచ్చు. నగరంలో పనులు చూసుకోవాల్సిన వారు, ఆస్పత్రులకు వెళ్లేవారు, వ్యాపారాల కోసం తిరిగేవారు, పర్యాటక ప్రాంతాలు చూడాలనుకునే వారు ఇలా అనేక మంది ఈ టికెట్ను ఉపయోగించుకుంటున్నారు.
ఈ రూ.100 ‘ట్రావెల్ యాజ్ యూ లైక్’ టికెట్ సిటీలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో అందుబాటులో ఉంటుంది. బస్సులో ఎక్కిన వెంటనే కండక్టర్ దగ్గర కొనుగోలు చేయవచ్చు. కండక్టర్ టికెట్ యంత్రంలో ప్రయాణికుడి వివరాలు నమోదు చేసిన వెంటనే ఈ టికెట్ ఇస్తారు. దీంతో బస్సు మార్పులు, చిన్న చిన్న దూరాల టికెట్లు తీసుకోవాల్సిన ఇబ్బందులు తగ్గిపోతాయి.
మొత్తం మీద విశాఖపట్నం ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ రూ.100 ప్రత్యేక టికెట్ పర్యాటకులకు, స్థానికులకు రెండింటికీ ఎంతో మేలు చేస్తోంది. ఒకే టికెట్తో రోజు మొత్తం నగరాన్ని చుట్టేయవచ్చు. ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో వచ్చే వారికి ఈ ఆఫర్ మరింతగా ఉపయోగపడుతుంది. అందుకే దీనిని ప్రయాణికులు పెద్ద సంఖ్యలో సద్వినియోగం చేసుకుంటున్నారు.