ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం జరుగుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే నిర్మాణ పనుల్లో 86 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 14 శాతం పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2026 జూన్ నాటికి ఈ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన స్పష్టం చేశారు.
శనివారం భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించిన రామ్మోహన్ నాయుడు, క్షేత్రస్థాయిలో నిర్మాణ పురోగతిని పరిశీలించారు. వర్షాకాలంలో కూడా పనులు ఆగకుండా కొనసాగిస్తున్న జీఎంఆర్ సంస్థపై ప్రశంసలు కురిపించారు. నిర్దేశిత గడువులోగా విమానాశ్రయం పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
విమానాశ్రయానికి అనుసంధానంగా రోడ్ల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వెల్లడించారు. విశాఖ నగరంతో భోగాపురం ఎయిర్పోర్టు సులువుగా కలిసేందుకు 7 కీలక రూట్లను గుర్తించామన్నారు. ఈ రోడ్డు పనులను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అదనంగా, ఎలివేటెడ్ కారిడార్, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు కూడా డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
అంతర్జాతీయ కనెక్టివిటీ పెంపుపై కూడా మంత్రి ప్రస్తావించారు. విశాఖ నుంచి కొచ్చి వంటి నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్రలో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు భారీగా పెరిగి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని రామ్మోహన్ నాయుడు నమ్మకం వ్యక్తం చేశారు.