ఇంటర్నెట్రెస్క్: తమ సంస్థ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా
పరిగణిస్తామని కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్(ఇండియా) ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) బృందానికి హామీ ఇచ్చారు.
సింగపూర్ పర్యటనలో భాగంగా నాలుగో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమ్సెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్షిప్స్ వంటి అంశాలపై కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ (ఇండియా) ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరిశంకర్ నాగభూషణంలతో చర్చించారు. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని వారికి వివరించారు.
వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయో డైవర్సిటీ కాంప్లెక్స్ లు, వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియెన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి మైక్ బార్క్ లేతో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్ లే సుముఖుత వ్యక్తం చేశారు.
పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై జపాన్కు చెందిన సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC) మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్తో ముఖ్యమంత్రి బృందం సమాలోచనలు జరిపింది. వివిధ ప్రాజెక్టుల్లో అవసరమైన ఆర్థిక భాగస్వామ్యంపై చర్చించారు. ఫైనాన్స్, ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్, క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ వంటి రంగాలపై తాము ఆసక్తితో ఉన్నామని ఎస్ఎంబీసీ ప్రతినిధులు ప్రకటించారు.