పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్..
తూర్పుగోదావరి సహా పలు జిల్లాలకు వర్ష సూచన..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. శుక్రవారం ఉదయం విడుదల చేసిన ప్రకటనలో తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. వర్షాల సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని సూచించారు.
పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు తెలిపారు. రైతులు, చేపల వేటకు వెళ్లే వారు, బయట పనులు చేసే వారు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, ప్రజలు వాతావరణ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా స్థానిక అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.