నీటి సీసా వెంట పెట్టుకోండి.. హైడ్రేటెడ్గా ఉండండి: మోదీ సూచనలు..
దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత.. అప్రమత్తంగా ఉండాలని ప్రధాని పిలుపు..
దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, ఇంటి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటి సీసా వెంట తీసుకెళ్లాలని సూచించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచూ నీళ్లు తాగుతూ హైడ్రేటెడ్గా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా మధ్యాహ్న వేళల్లో ఎండ తీవ్రంగా ఉండే సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ఈ కఠినమైన వేసవి రోజుల్లో పరస్పర సహకారం ఎంతో అవసరమని ప్రధాని పేర్కొన్నారు. దాహంతో ఉన్న వారికి ఒక గ్లాసు నీళ్లు ఇవ్వడం కూడా గొప్ప సేవేనని అన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఆరోగ్యం గురించి తరచూ ఆరా తీస్తూ వారికి జాగ్రత్తలు చెప్పాలని సూచించారు. పెద్దలు, చిన్నారులు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని, ఎండలో ఎక్కువసేపు తిరగకుండా చూడాలని కోరారు.
జంతువులు, పక్షుల పట్ల కూడా మానవత్వంతో వ్యవహరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇళ్ల ముందు, బాల్కనీల్లో, షాపులు లేదా కార్యాలయాల వద్ద చిన్న పాత్రల్లో నీళ్లు ఉంచాలని సూచించారు. ఇప్పటికే చాలా మంది తమ ఇళ్ల ముందు మట్టికుండల్లో తాగునీళ్లు ఉంచి ప్రజలకు సహాయం చేస్తున్నారని ప్రశంసించారు. ఈ క్లిష్టమైన వేసవి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు అండగా నిలవాలని, సానుభూతి మరియు మానవత్వంతో వ్యవహరించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు.