ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కీలక సమావేశాలను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఆస్ట్రేలియా సీఫుడ్ ఇండస్ట్రీ (SIA) సీఈవో వెరోనికా పాపకోస్టా, ఎంగేజ్ మేనేజర్ జాస్మిన్ కెల్లే తదితర ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులను అనుసంధానించే అవకాశాలను చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన ట్రేడ్ మిషన్లు, నెట్వర్కింగ్ కార్యక్రమాలను నిర్వహించి, స్థానిక ఎగుమతిదారులందరికీ గ్లోబల్ మార్కెట్లో పరిచయం కల్పించాలనే లక్ష్యాన్ని మంత్రి లోకేష్ సుస్పష్టం చేశారు.
భేటీలో ప్రధానంగా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంపు నిల్వ కాలం ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ మేనేజ్మెంట్, క్వాలిటీ ప్యాకేజింగ్ వంటి అంశాల్లో రాష్ట్రానికి సహకారం అందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచడం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించడం ఈ భేటీలో చర్చించడం జరిగింది.
తదుపరి కార్యక్రమంలో మంత్రి లోకేష్ గ్రేటర్ సిడ్నీలోని పారమట్టా నగరానికి వెళ్లి లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్తో భేటీ అయ్యారు. పారమట్టాలో స్థానిక వ్యాపారులతో పెట్టుబడులను ఆకర్షించే దిశగా మేయర్ చేసిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. సార్టప్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాల అభివృద్ధికి గ్లోబల్ నెట్వర్క్ ఏర్పాట్లలో సహకారం అందించమని ఆయన కోరారు.
సమావేశాల తరువాత మంత్రి లోకేష్ హారిస్ పార్క్లో ఏర్పాటు చేసిన రివర్ సైడ్ ఫుడ్ కోర్ట్ లిటిల్ ఇండియా ను సందర్శించారు. అక్కడి వాణిజ్య, సాంస్కృతిక అనుసంధానాలు, ప్రాంతీయ వ్యాపారాలకు అందే అవకాశాలను పరిశీలించారు. ఈ సందర్శనలో ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తుల గ్లోబల్ ప్రమోషన్, స్థానిక వ్యాపారాల అభివృద్ధి, సాంస్కృతిక అనుసంధానం వంటి అంశాలు మరోసారి హైలైట్ అయ్యాయి.
ఈ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తుల రంగం, స్థానిక వ్యాపారాల ప్రోత్సాహం, అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు వంటి అంశాల్లో ప్రగతి సాధించే దిశలో మరొక మైలురాయి ఏర్పడుతుందని చెప్పుకోవాలి.