AP Inter Academic Calendar: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది. వేసవి సెలవుల తర్వాత జూన్లో కాలేజీలు ప్రారంభం అవుతుంటాయి, కానీ ఈసారి మాత్రం ఇంటర్ బోర్డు కొత్త నిర్ణయం తీసుకుంది. ఫస్టియర్ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ 1వ తేదీ నుంచే సెకండియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. అంటే విద్యార్థులు వేసవి తాపాన్ని తట్టుకుంటూనే కొన్ని రోజుల పాటు క్లాసులకు హాజరు కావాల్సి ఉంటుంది.
విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 23 వరకు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు. సిలబస్ను ముందుగానే గాడిలో పెట్టే ఉద్దేశంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమై మే 31 వరకు కొనసాగుతాయి. దాదాపు 37 రోజుల పాటు విద్యార్థులకు వేసవి విరామం లభించనుంది. తిరిగి జూన్ 1వ తేదీన కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని బోర్డు స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 232 పని దినాలు ఉంటాయని అధికారులు లెక్కగట్టారు.
మరోవైపు ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అడ్మిషన్ల పేరుతో విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వకూడదని ఆదేశించింది. ముఖ్యంగా మా దగ్గర చదివితే స్టేట్ ర్యాంకులు వస్తాయి.. గ్యారెంటీగా పాస్ చేయిస్తాం అంటూ ప్రచారం చేయడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. గోడలపై రాతలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా విచ్చలవిడిగా అడ్మిషన్ల ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కాలేజీల మధ్య అనారోగ్యకరమైన పోటీని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు పేర్కొంది.
ఇక పరీక్షల షెడ్యూల్ విషయానికి వస్తే.. అక్టోబరు 5 నుంచి 9 వరకు క్వార్టర్లీ పరీక్షలు, నవంబరు 25 నుంచి 30 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహించనున్నారు. దసరా పండుగ కోసం అక్టోబరు 10 నుంచి 20 వరకు, అలాగే సంక్రాంతి కోసం జనవరి 9 నుంచి 17 వరకు సెలవులు ప్రకటించారు. జనవరి మూడో వారంలో ప్రీ-ఫైనల్ పరీక్షలు ముగించి, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఫిబ్రవరి చివరలో లేదా మార్చి నెలలో ఇంటర్ పబ్లిక్ థియరీ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 18వ తేదీని ఈ విద్యా సంవత్సరపు చివరి పని దినంగా నిర్ణయించారు.
ఏపీలో ఇంటర్ విద్యారంగంలో మార్పులు తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2025-26 నుంచే ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశపెడుతూ సీబీఎస్ఈ విధానాన్ని తీసుకొస్తున్న తరుణంలో, ఈ అకడమిక్ క్యాలెండర్ అమలు చాలా కీలకం కానుంది. విద్యార్థులు ఈ కొత్త మార్పులకు అనుగుణంగా తమ చదువులను ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, కాలేజీల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంది.