అక్రమాలపై విజిలెన్స్ ఉక్కుపాదం!
76వ ర్యాంకు నుండి 41 స్థానం - లక్ష్యం టాప్ 10.
ప్రక్షాళన – మ్యాన్ పవర్ ఆడిట్
Nara Lokesh: విశాఖపట్నం గర్వకారణం, వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీ గత ఐదేళ్లలో ఎదుర్కొన్న చీకటి రోజులను వీడి, ఇప్పుడు మళ్ళీ తన వైభవాన్ని చాటుకునేందుకు సిద్ధమవుతోంది. కులపతులు అంటే సామాజిక వర్గం అనుకొని భ్రష్టు పట్టించాడు జగన్. శాసనసభలో విశాఖ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వర్సిటీ ప్రక్షాళనపై సంచలన ప్రకటనలు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రా యూనివర్సిటీని ఒక రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చేశారని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత లేని రాజకీయ కార్యకర్తలను విచ్చలవిడిగా వివిధ పోస్టుల్లో నియమించిన తీరుపై ఇప్పుడు ప్రభుత్వం "మ్యాన్ పవర్ ఆడిట్" నిర్వహిస్తోంది. వచ్చే 30 రోజుల్లో ఈ ఆడిట్ పూర్తి చేసి, అక్రమ నియామకాలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఆ తర్వాతే, దీర్ఘకాలంగా పనిచేస్తున్న అర్హులైన కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్ (NMR) మరియు రోజువారీ వేతన సిబ్బందికి కనీస వేతన శ్రేణి (MTS) కల్పించడంపై ఆర్థిక శాఖతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.
మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన ఆర్థిక మరియు పరిపాలనాపరమైన అవతవకలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ విచారణ నివేదిక మరో 45 రోజుల్లో ప్రభుత్వానికి అందనుంది. నివేదికలో తప్పు చేసినట్లు తేలితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.
ర్యాంకింగ్స్లో మళ్ళీ 'టాప్' వైపు పయనం
గత ఐదేళ్లలో ఏయూ ప్రతిష్ట ఎలా మసకబారిందో మంత్రి గణాంకాలతో వివరించారు.
యూనివర్సిటీ విభాగంలో 2019లో 16వ స్థానంలో ఉన్న ఏయూ, 2023 నాటికి 43వ స్థానానికి పడిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణల వల్ల 2025 నాటికి మళ్ళీ 23వ స్థానానికి మెరుగుపడింది.
ఓవరాల్ (NIRF) విభాగంలో: 2019లో 29వ ర్యాంకులో ఉండగా, అది 2023లో 76వ ర్యాంకుకు దిగజారింది. ప్రస్తుతం దీనిని 41వ స్థానానికి తీసుకువచ్చామని, భవిష్యత్తులో టాప్-10 లోకి తీసుకురావడమే తమ లక్ష్యమని లోకేష్ ప్రకటించారు.
శతాబ్ది ఉత్సవాల సందడి
ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల మైలురాయిని చేరుకుంటున్న సందర్భంగా, శతాబ్ది ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేల సలహాలను తీసుకుని, రేపు విశాఖ పర్యటనలో భాగంగా వీసీతో కలిసి స్వయంగా మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.