దరఖాస్తు గడువు ఫీజు వివరాలు
పరీక్షా విధానం అర్హతలు
ఉచిత సదుపాయాలు లక్ష్యం
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదర్శ పాఠశాలల్లో (Model Schools) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని ఆశపడే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాణ్యమైన చదువును పూర్తిగా ఉచితంగా పొందేందుకు విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఈ నెల 23 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ www.csc.ap.gov.in లో తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము విషయానికి వస్తే, ఓసీ బీసీ విద్యార్థులకు రూ. 200 గా నిర్ణయించగా, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రూ. 125 గా నిర్ణయించింది ప్రభుత్వం . ఆన్లైన్లో ఫీజు చెల్లించిన తర్వాత వచ్చే ఐడీ నంబర్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ పాఠశాలల్లో సీటు సంపాదించాలంటే విద్యార్థులు ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఏప్రిల్ 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఐదో తరగతి స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ, ప్రమోషన్ పొందిన వారు ఈ పరీక్షకు అర్హులు. పరీక్షలో సాధించిన మార్కులు రిజర్వేషన్ల ఆధారంగా అడ్మిషన్లు కల్పించనున్నారు.
ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో చేరిన విద్యార్థులకు ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతో పాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వంటి ఇతర సదుపాయాలు కూడా ఉచితంగా అందుతాయి. గ్రామీణ విద్యార్థులు పట్టణాలలోని ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వారి ఇంటి దగ్గరే అత్యుత్తమ విద్యను అందించాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రతి పాఠశాలలో దాదాపు 80 నుంచి 100 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో అవకాశం లభిస్తుంది.
అడ్మిషన్లకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా విద్యార్థులు తల్లిదండ్రులు తమకు దగ్గరలో ఉన్న మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ను లేదా స్థానిక ఎంఈఓ (MEO) కార్యాలయంలో సంప్రదించవచ్చు. దరఖాస్తు గడువు మార్చి 31తో ముగుస్తున్నందున, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని విద్యాశాఖ కోరుతోంది.