శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆలయ పరిధిలో అన్యమత ప్రార్థనలు, ప్రచారాలు, బోధనలు పూర్తిగా నిషేధమని తెలిపారు. అలాగే అన్యమతాలకు సంబంధించిన కరపత్రాలు, పుస్తకాలు పంచడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టంగా చెప్పారు. ఆలయ పవిత్రతను, భక్తుల విశ్వాసాలను కాపాడటమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమని వివరించారు.
అలాగే శ్రీశైలం దేవస్థానం అనుమతి లేకుండా వీడియోలు తీయడం, ఫోటోలు తీసుకోవడం, డ్రోన్లు ఎగురవేయడం పూర్తిగా నిషేధమని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోలు, రీల్స్ చేయడంపై కఠిన ఆంక్షలు విధించారు. ఇటువంటి చర్యల వల్ల ఆలయ పరిసరాల్లో భక్తుల ప్రశాంతతకు భంగం కలుగుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు, భక్తుల భద్రతను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేవస్థానం ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.
శ్రీశైలం ఆలయ పరిధిలో ధూమపానం, మద్యపానం సేవించడం, జూదం ఆడటం, మాంసాహారాలు తినడం వంటి చర్యలు పూర్తిగా నిషేధమని దేవస్థానం అధికారులు మరోసారి గుర్తు చేశారు. ఇవన్నీ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం చట్టరీత్యా నేరాలుగా పరిగణిస్తామని తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తుల సహకారం ఉంటేనే ఆలయ నిర్వహణ సక్రమంగా జరుగుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలని ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
ఇటీవల నాలుగు రోజుల క్రితం శ్రీశైలంలో ఓ యువతి రీల్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చ జరిగింది. ఈ విషయంపై స్పందించిన ఆ యువతి, తాను ఎలాంటి హద్దులు దాటలేదని, పద్ధతిగానే రీల్ చేశానని తెలిపింది. అయితే కొందరు తనను ట్రోల్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో స్పందిస్తూ, భక్తులందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎవరైనా హద్దులు మీరిస్తే చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు. శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ విషయాలను గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.